సమంత పారితోషికం తగ్గించుకుందట

  • IndiaGlitz, [Thursday,February 22 2018]

నేర పరిశోధనలో పోలీస్ శాఖకి మీడియా కూడా తోడైతే ఎటువంటి కేసునైనా ఛేదించ‌గ‌ల‌రు. ఇదే నేపథ్యంతో తెరకెక్కుతున్న చిత్రం యూ టర్న్'. 2016లో కన్నడలో విజయం సాధించిన ఈ కథను ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో పునఃనిర్మిస్తున్నారు. ఒక వంతెనపై ద్విచక్రవాహన చోదకులు హత్యకు గురవుతూ ఉండడం... ఆ కేసు పరిశోధన కోసం పోలీస్ ఆఫీసర్ కు ఒక జర్నలిస్ట్ సాయపడే నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. ఇందులో సమంత జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. ఇక పోలీస్ ఆఫీసర్‌గా ఆది నటించనున్నారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సమంతపై కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు.

కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రం కావడంతో తక్కువ బడ్జెట్ తోనే సినిమాని రూపొందిస్తున్నారు. అందునా సమంతకి ఇది ఫేవరెట్ చిత్రం కావడంతో పాటు... ఆమెకు ఆసక్తి ఉన్న పాత్ర కావడంతో త‌న పారితోషికాన్ని కూడా తగ్గించుకున్నారని సమాచారం. ఆమె ఇదివరకు ఇటువంటి పాత్రని చేయలేదని... అలాగే ఈ చిత్రంలో ఎంతో వైవిధ్యంగా కూడా కనిపించబోతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మాతృకను తెరకెక్కించిన పవన్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలోనే ఈ రీమేక్‌ కూడా రూపొందుతోంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.