ఒక్కపూట భోజనంతోనే రెండు నెలలు .. రూ.500 కోసం ఆ పని: కంటతడి పెట్టిస్తోన్న సమంత ఫ్లాష్‌ బ్యాక్

  • IndiaGlitz, [Saturday,February 05 2022]

జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు.. ఇప్పుడు వెండితెర మీద స్టార్లుగా వెలుగొందుతున్న వారంతా ఒకప్పుడు తినేందుకు తిండి లేక అలమటించిన వారే. సినిమా ఛాన్సుల కోసం చెన్నై, హైదరాబాద్, ముంబైలలో చెప్పులు అరిగేలా తిరిగి కన్నీళ్లు మింగి బ్రతికిన వారే. కృషి , పట్టుదల, క్రమశిక్షణలతో అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో ఓ స్థాయికి వచ్చారు. ప్రతి ఒక్కరిది కన్నీటి వ్యధే. ఈ లిస్ట్‌లోకే వస్తారు సమంత.

ఇప్పుడు దక్షిణాదిలో అగ్ర కథానాయికగా.. కోట్లాది రూపాయల పారితోషికం అందుకుంటున్నారు సామ్. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఆమె ఫ్యాన్ బేస్ వుండటంతో సమంత ఎన్ని కోట్లు డిమాండ్ చేసినా ఇచ్చేందుకు నిర్మాతలు క్యూలో రెడీగా వుంటారు. అయితే ఈ స్థాయికి రావడం వెనుక తాను ఎన్నో కష్టాలను పడినట్లు వెల్లడించారు సామ్.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. చదువుల్లో ప్రతిభావంతురాలినే అయినా ఆర్ధిక కష్టాల కారణంగా పై చదువులు చదువుకునేందుకు తన దగ్గర డబ్బులు లేవని సమంత ఉద్వేగానికి గురయ్యారు. అందుకే బాగా చదువుకోవాలనే కోరికతో ఫంక్షన్లు జరిగేటప్పుడు గేట్ దగ్గర వెల్‌కమ్ చెప్పే అమ్మాయిగా పనిచేశానని.. అందుకు తనకు రూ.500 ఇచ్చేవారని సమంత తెలిపారు. తన చేతిలో డబ్బులు లేనప్పుడు ఒక్కపూటే భోజనం చేసిన రోజులున్నాయని సామ్ ఎమోషనల్‌ అయ్యారు. ఒంటిపూట భోజనంతోనే రెండేసి నెలలు గడిపేశానని.. ఖర్చలు కోసం మోడలింగ్ కూడా చేసినట్లు గుర్తుచేసుకున్నారు. ఈ సమయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం మరిచిపోలేనని సమంత చెప్పారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ‘‘య‌శోద’’ వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో సమంత ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే జాన్ పిలిప్ ద‌ర్శ‌క‌త్వంలో అరెంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్ అనే ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీలోనూ సామ్ నటించనున్నారు.