Salman Khan: థియేటర్‌లో టపాసులు కాల్చడంపై సల్మాన్‌ ఖాన్ ఆందోళన

  • IndiaGlitz, [Monday,November 13 2023]

తమ హీరో సినిమా రిలీజ్ అయితే చాలు అభిమానులు చేసే సందడి అంత ఇంత కాదు. అభిమాన హీరోను వెండితెరపై చూస్తూ థియేటర్లలో వారు చేసే రచ్చ మాటల్లో చెప్పలేం. ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా తమ అభిమానం చాటుకుంటారు. సాధారణంగా చప్పట్లు కొడుతూ, విజిల్స్ వేస్తూ, పేపర్లు, పూలు చల్లుతూ సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమానాన్ని పిచ్చి మూర్ఖత్వంతో చాటుకున్నారు. దీంతో థియేటర్లలో ఉన్న ప్రేక్షకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

దీపావళి కానుకగా సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ నటించిన 'టైగర్-3' నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్లలో సల్మాన్ అభిమానులు బాణసంచా కాల్చుతూ హంగామా చేశారు. మహారాష్ట్రకు చెందిన నాసిక్ జిల్లా మాలేగావ్‌లోని ఓ థియేటర్లో అభిమానులు తెర ముందు టపాసులు కాలుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో ఆ సౌండ్స్‌కు థియేటర్లలో ఉన్న సిబ్బందితో పాటు ప్రేక్షకులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజాగా ఈ వీడియో సల్మాన్ ఖాన్ దృష్టికి కూడా వెళ్లింది. అభిమానులు థియేటర్ లోపల బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు చేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు. టైగర్-3 సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ల లోపల బాణసంచా కాల్చుతున్న విషయం నాకు తెలిసింది. ఇది చాలా ప్రమాదకరం. మీ ప్రాణాలతో పాటు ఇతర ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకుండా ఉండండి. హాయిగా సినిమాను ఆస్వాదించండి. సురక్షితంగా ఉండండి అంటూ సోషల్ మీడియాలో స్పందించారు. కాగా ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో మొదటిరోజు దేశవ్యాప్తంగా రూ.44 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.