'సిద్ధార్ధ'కి జోడీగా సాక్షీ చౌదరి

  • IndiaGlitz, [Tuesday,September 15 2015]

'పోటుగాడు', 'జేమ్స్ బాండ్' వంటి హిట్ చిత్రాల్లో నటించిన సాక్షీ చౌదరికి ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. మరోవైపు బాలీవుడ్ లో కూడా తను నటిస్తోంది. ప్రముఖ హిందీ సంగీతదర్శకుడు ఇస్మాయిల్ దర్బార్ తొలి ప్రయత్నంగా స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఓ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీలో కథానాయికగా నటిస్తోంది సాక్షి. ఇక, తెలుగులో ఈ మధ్యకాలంలో విన్న కథల్లో 'సిద్ధార్ధ' నచ్చడంతో ఈ చిత్రంలో ఓ కథానాయికగా నటించడానికి అంగీకరించింది. ఇప్పటికే ఈ చిత్రంలో రాగిణీ నంద్వాని ఓ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. బుల్లితెరపై బోల్డంత పాపులార్టీ తెచ్చుకున్నఆర్.కె. నాయుడు హీరోగా రామ దూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీనియస్, రామ్ లీల చిత్రాల ద్వారా నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని రాజీపడకుండా నిర్మిస్తున్నారు. లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి దయానంద్ రెడ్డి దర్శకుడు.

ఈ చిత్రవిశేషాలను దాసరి కిరణ్ కుమార్ తెలియజేస్తూ - ''కథానుగుణంగా ఈ చిత్రంలో ఇద్దరు నాయికలు ఉంటారు. సినిమాలో ఇద్దరి పాత్రలకూ ప్రాధాన్యం ఉంటుంది. అనుకున్న ప్రకారమే షూటింగ్ జరుగుతోంది. బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్.కె. నాయుడికి ఈ చిత్రం మంచి బ్రేక్ అవుతుంది. ఇందులో పవర్ ఫుల్ రోల్ ను బ్రహ్మండంగా చేస్తున్నాడు. ఇటీవలే 22 రోజులు మలేసియాలోని అందమైన ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. దాంతో తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ మొదలుపెడతాం. ఆ షెడ్యూల్ తో టాకీ పార్ట్ పూర్తవుతుంది'' అని చెప్పారు.

ఈ చిత్రానికి కథ - విసు, రచనా సహకారం - రవిరెడ్డి మల్లు, కెమెరా - యస్.గోపాల్ రెడ్డి, సంగీతం - మణిశర్మ, సాహిత్యం - అనంత శ్రీరామ్, మాటలు - పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, ఫైట్స్ - సాల్మాన్ రాజ్ (భాహుబలి ఫేం), ఆర్ట్ - బ్రహ్మ కడలి, కొరియోగ్రఫీ - హరీశ్ పాయ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత - ముత్యాల రమేశ్, సమర్పణ - లంకాల బుచ్చిరెడ్డి, నిర్మాత - దాసరి కిరణ్ కుమార్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - దయానంద్ రెడ్డి.