పార్టీ వద్దని షర్మిలకు నచ్చజెప్పాం: సజ్జల

  • IndiaGlitz, [Tuesday,February 09 2021]

తెలంగాణలో ఊహించని రీతిలో దివంగత ముఖ్యమంత్రి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. నేడు ఆమె ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అయితే పార్టీ గురించిన వివరాలు కానీ.. పార్టీ పేరు కానీ షర్మిల వెల్లడించలేదు. కానీ పార్టీ పెట్టబోతున్నారన్న ఊహాగానాలకు బలం చేకూర్చారు. అయితే షర్మిల లోటస్‌పాండ్‌కు వచ్చిన దగ్గర నుంచి సమావేశం పూర్తయ్యే వరకూ తెలుగు మీడియా అంతా ఆమెపై ఫోకస్ చేసింది కానీ ‘సాక్షి’ మాత్రం పట్టనట్టే వ్యవహరించింది. కనీసం ఆమె కార్యక్రమాన్ని కవరేజ్ కూడా చేయలేదు.

ఈ క్రమంలో షర్మిలతో తాము విభేదిస్తున్నామన్న సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకే జగన్ అలా చేశారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కాగా.. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. మంగళవారం షర్మిల పార్టీ గురించి మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ పెట్టొద్దని షర్మిలకు నచ్చజెప్పే ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. షర్మిల తమ ఆత్మీయ సోదరని తెలిపారు. గత మూడు నెలలుగా పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సజ్జల వెల్లడించారు.

వైసీపీలాంటి పార్టీ తెలంగాణలో కూడా ఉండాలని షర్మిల భావించి ఉండొచ్చని సజ్జల పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే.. వైసీపీని తెలంగాణలో విస్తరించలేదని తేల్చి చెప్పారు. షర్మిలను పార్టీ పెట్టొద్దని నచ్చజెప్పే ప్రయత్నాలు సైతం జరిగాయని సజ్జల వెల్లడించారు. జగన్‌, షర్మిల మధ్య వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. తెలంగాణలో సుదీర్ఘకాలం షర్మిల పాదయాత్ర చేశారని, పార్టీ నిర్ణయం, ఫలితాలను షర్మిలే చూసుకుంటారన్నారు. పార్టీని కుటుంబపరం చేశారనే విమర్శలు వస్తాయని జగన్‌ భావించారని సజ్జల తెలిపారు.