క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టిన సైనా, సింధు.. ప్రత్యర్థులకు దడ!

చైనాలోని వుహాన్‌ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, సమీర్ వర్మలు క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. గురువారం జరిగిన మహిళల సింగిల్‌ ప్రిక్వార్టర్‌ పోరులో సైనా, సింధులు వరుస సెట్లలో ప్రత్యర్థుల పై విజయం సాధించి క్వార్టర్స్‌ బెర్తును ఖాయం చేసుకున్నారు. అటు సింధు.. ఇటు సైనా ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ.. దడ పుట్టిస్తున్నారు!. ఇద్దరూ గెలవడంతో క్రీడాభిమానులు, అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వారికి పెద్ద ఎత్తున కంగ్రాట్స్ చెబుతున్నారు.

ఎవరు ఎవరిపైన గెలిచారు..!?

ప్రీ క్వార్టర్స్‌లో పీవీ సింధు 21-15, 21-19 తేడాతో ఇండోనేషియాకు చెందిన చోరన్నిసాపై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో పీవీ సింధు చైనాకు చెందిన వరల్డ్ నెంబర్ 17 ర్యాంకర్ కాయ్ యానన్‌తో తలపడనుంది. సైనా నెహ్వాల్‌ 21-13, 21-13 తేడాతో దక్షిణ కొరియాకు చెందిన కిమ్‌‌గా ఎన్‌పై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో సైనా.. తన కంటే మెరుగైన ర్యాంకులో ఉన్న జపాన్‌కు చెందిన ఆకానె యమగూచితో తలపడనుంది. మరొవైపు పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సమీర్‌ వర్మ 21-12, 21-19 తేడాతో కా లాంగ్‌ ఆంగస్‌(హాంకాంగ్‌)పై విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు.