ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను : మెగా ఫ్యామిలీ ప్రేమపై సాయి తేజ్ భావోద్వేగం

  • IndiaGlitz, [Saturday,November 06 2021]

రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇటీవల డిశ్చార్జ్ అయ్యారు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఆయన పూర్తిగా కోలుకున్నారని సాయి తేజ్ మేనమామ, మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. దీపావళి పండుగ నాడు సాయిధరమ్ తేజ్‌తో దిగిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘అందరి ఆశీస్సులు, దీవెనలు ఫలించి సాయి పూర్తిగా కోలుకున్నాడు... మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండగ’ అని చిరు అన్నారు. ఈ గ్రూప్ ఫొటోలో మెగా హీరోలు పవన్‌ కల్యాణ్‌, నాగబాబు, రామ్‌ చరణ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, అల్లు అర్జున్‌, వైష్ణవ్‌ తేజ్‌, అకీరా సందడి చేశాడు. ఆ వెంటనే ‘నా పునర్జన్మకు కారణమైన మీ ప్రేమకు, ప్రార్థనలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం’ అంటూ సాయి ట్వీట్‌ చేశారు.

కాగా వినాయక చవితి సందర్భంగా సాయి తేజ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మాదాపూర్ దుర్గంచెరువు వద్ద వున్న కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఆయన నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ జారిపోవడంతో సాయితేజ్ కిందపడ్డారు. ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్‌ తలతో పాటు ఛాతీ, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్‌ అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయారు. అనంతరం తొలుత 108 ద్వారా మెడికవర్‌ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆపై మరింత మెరుగైన చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి అడ్మిట్ చేశారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే ఉన్నారు సాయి ధరమ్ తేజ్. 35 రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు.