తమిళనాడు ఎన్నికల్లో రూ.428 కోట్లు సీజ్

  • IndiaGlitz, [Tuesday,April 06 2021]

తమిళనాడులో మరికొద్ది గంటల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు ప్రలోభాలకు తెరదీశాయి. బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను ఓటర్లకు పార్టీ నేతలు ఎరగా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ) దీనిపై దృష్టి సారించి.. బంగారం, నగదు, ఇతరత్రా విలువైన వస్తువులను సీజ్‌ చేసింది. వీటి విలువ ఎంతుంటుందో తెలిస్తే షాక్ అవక మానరు. వీటి విలువ అక్షరాల 428 కోట్ల రూపాయలని ఎస్ఈసీ తేల్చింది.

వీటిని ఓటర్లకు పంచడానికి సిద్ధంగా ఉంచడంతో ఎస్ఈసీ దాడి చేసి సీజ్ చేసింది. వీటిలో రూ. 225.5 కోట్ల నగదు, రూ.200 కోట్లకుపైగా విలువైన బంగారం, మద్యం, గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికలు మరో 72 గంటల్లో జరగనున్న నేపథ్యంలో.. ఈ సమయం అత్యంత కీలకమని, ఈ సమయంలోనే రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభపెట్టే అవకాశం ఉందని ఈసీ వెల్లడించింది. విషయం తెలుసుకుని తమిళ వాసులు సైతం అవాక్కవుతున్నారు.

కాగా, గడిచిన 24 గంటల్లో చెన్నై సహా కోయంబత్తూర్, కరూర్, తిరుప్పూర్, తదితర నగరాల్లోని అనుమానిత ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. బృందాలుగా విడిపోయిన అధికారులు ఆయా ప్రాంతాల్లో సోదాలు చేయగా 428 కోట్ల సొత్తు పట్టుబడినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల నేపథ్యంలో అక్రమ సొత్తు బయటపడిన నగరాల్లో కరూర్ అగ్రస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో కోయంబత్తూర్, తిరుప్పూర్, చెన్నై నగరాలు ఉన్నాయని ఈసీ పేర్కొంది. అయితే ఈ సొత్తు ఏ పార్టీకి చెందిందనే విషయం మాత్రం తెలియరాలేదు.