Vyooham, Shapadham:ఆర్జీవీ వ్యూహం, శపథం సినిమాల విడుదల ఎప్పుడంటే..?

  • IndiaGlitz, [Wednesday,October 11 2023]

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఏపీ సీఎం జగన్ జీవితం ఆధారంగా తీసిన రెండు సినిమాల విడుదల తేదిని ప్రకటించాడు. కొంతకాలంగా ఓ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆ పార్టీకి సంబంధించిన సినిమాలే తీస్తున్నారు ఆర్జీవీ. గత ఏడాది ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలు తీశాడు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయానికి వ్యూహం, శపథం అనే సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు.

నవంబర్ 10న వ్యూహం.. జనవరి 25న శపథం..

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం 2009 నుంచి 2014 మధ్య జగన్ జీవితంలో జరిగిన సన్నివేశాల ఆధారంగా వ్యూహం సినిమా తెరకెక్కించాడు. ఇక 2014 నుంచి 2019 ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యే సన్నివేశాల ఆధారంగా శపథం సినిమా తీశాడు. ఇప్పటికే వ్యూహం టీజర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు. ఇప్పుడు రెండు సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు. వ్యూహం సినిమాని 2023 నవంబర్ 10న , శపథం సినిమాని 2024 జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు ఆర్జీవీ. ఇక ఈ రెండు సినిమాలకు వైసీపీ నేత దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

థియేటర్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మరి..?

గతంలో తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలు ఘోర పరాజయం చవిచూశాయి. సినిమాలో కంటెంట్ కంటే ఇతర పార్టీల నేతలను కించపరుస్తూ తీసిన సన్నివేశాలే ఉన్నాయని ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ విమర్శలు చేశాయి. మరి ఇప్పుడు తీసిన ఈ రెండు సినిమాలు కూడా జగన్ జీవితం ఆధారంగా తెరెక్కించడంతో థియేటర్లలో ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.