‘దిశ’ నిందితుడి భార్యతో ఆర్జీవీ భేటీ.. కీలక వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఓ ఎమోషనల్ స్క్రిప్టును ఎంచుకున్నానని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. యథార్థ కథాంశాలతో సినిమాలు తీసే ఆర్జీవీ.. తెలుగు నాట సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటనపై సినిమా తీయాలని మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలో ఈ ఘటనకు సంబంధించి వరుస విషయాలను తన ట్విట్టర్ వేదికగా ఆయన అభిమానులు, సినీ ప్రియులతో పంచుకున్నాడు. ఈ సినిమా ద్వారా అత్యాచార నిందితులు తెలుసుకునేలా ఓ భయంకర గుణపాఠాన్ని నేర్పబోతున్నానని ఆయన తెలిపారు.

చిన్నారి అయ్యుండి.. మరో చిన్నారికి!
అయితే ఈ సినిమా కథలో భాగంగా.. ‘దిశ’ కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్యతో ఆర్జీవీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమెతో నిశితంగా చర్చించిన ఆయన.. ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చెన్నకేశవులు భార్యను ఇప్పుడే కలిశాను. ఆమె రేపిస్ట్ చెన్నకేశవులు భార్య. 16 ఏళ్ల వయసులో ఆమెను చెన్నకేశవులు పెళ్లి చేసుకున్నాడు. అతడి బిడ్డకు ఆమె 17 ఏళ్ల వయసులో జన్మనివ్వనుంది. దిశ జీవితాన్నే కాదు.. అతడు తన భార్యను కూడా బాధితురాలిగా చేశాడు. ఒక చిన్నారి అయ్యుండి ఆమె మరో చిన్నారికి జన్మనిస్తుంది. వారిద్దరికీ మంచి భవిష్యత్తు లేదు’ అని ఒకింత భావోద్వేగంతో ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు, వీరాభిమానులు చిత్ర విచిత్రాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరైతే సారూ.. ఆమెకు ఆర్థికంగా సాయం చేయండి అని సలహా ఇచ్చారు.