Chandrababu: సీఐడీ కార్యాలయాలకు వెళ్లిన చంద్రబాబు.. మళ్లీ ఎందుకంటే..?

  • IndiaGlitz, [Saturday,January 13 2024]

టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో పర్యటించారు. హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన.. నేరుగా విజయవాడ తులసీనగర్‌లో ఉన్న సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఉచిత ఇసుక కేసులో అధికారులకు పూచీకత్తు, బాండ్ సమర్పించారు. మరోవైపు పార్టీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నారు. జై బాబు..జైజై బాబు నినాదాలతో హోరెత్తించారు. అధికారులు చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టారంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బయటకు వచ్చిన అనంతరం కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఓ చిన్నారిని ఎత్తుకుని కాసేపు సరదాగా గడిపారు.

అక్కడి నుంచి నేరుగా ఐఆర్ఆర్ కేసులో కుంచనపల్లి, మద్యం కేసులోనూ తాడేపల్లి సీఐడీ కార్యాలయాలకు వెళ్లి బాండ్లు సమర్పించారు. చంద్రబాబు తరపున టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్ బాబు పూచీకత్తు సంతకాలు చేశారు. కాగా ఇన్నర్‌ రింగ్ రోడ్డుతో పాటు మద్యం, ఇసుక కేసుల్లో హైకోర్టు చంద్రబాబుకి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల్లో లక్ష రూపాయల బాండ్లతో పాటు పూచీకత్తు అధికారులకు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వాటిని సమర్పించేందుకు చంద్రబాబు ఆయా కార్యాలయాలకు వెళ్లారు.

మరోవైపు స్కిల్ డెలవప్‌మెంట్ కేసులో తనపై చట్ట విరుద్ధంగా కేసు నమోదు చేశారని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టులో ఆశ్రయించిన విషం విధితమే. ఈ కేసులో 17ఏ సెక్షన్ వర్తిస్తుందని ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం గతేడాది అక్టోబర్ 20వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. అప్పటి నుంచి మూడు నెలల పాటు రిజర్వ్‌లో ఉన్న తీర్పును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈనెల 17న వెల్లడించనుంది. దీంతో ఈ తీర్పుపై టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.