రానా వెడ్డింగ్ ఇన్విటేష‌న్‌(ఫ్యాన్ మేడ్)... వేదిక మార‌నుందా?

  • IndiaGlitz, [Friday,July 24 2020]

సినీ ప‌రిశ్ర‌మ‌లో ద‌గ్గుబాటి వారికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. వీరి మూడోత‌రంగా సినీ రంగంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నాడు రానా ద‌గ్గుబాటి. ఈ పాన్ ఇండియా న‌టుడు, మిహీకా బ‌జాజ్‌ను పెళ్లి చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే. రానా, మిహీకల మ్యారేజ్‌ ఆగ‌స్ట్ 8న హైద‌రాబాద్‌లో జ‌రగనుంది. వీరి పెళ్లి హైద‌రాబాద్‌లోని ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో జ‌రుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరి పెళ్లి సంబంధించిన వివరాలతో ఓ ఫ్యాన్ రానా పెళ్లి ప‌త్రిక అంటూ వీడియో త‌యారు చేశారు. ఈ డిజిట‌ల్ ప‌త్రిక(ఫ్యాన్ మేడ్‌) నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతుంది. ఇప్పుడు వీరి పెళ్లికి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో వార్త‌ల హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

అదేంటంటే.. ఇప్పుడు రానా ద‌గ్గుబాటి, మిహీకా కుటుంబ స‌భ్యులు పెళ్లి వేదిక‌ను మార్చాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఎందుకంటే ప్ర‌స్తుతం క‌రోనా ఎఫెక్ట్ చాలా ఎక్కువైంది. ఈ నేప‌థ్యంలో ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో వివాహం చేస్తే ఎంత మాత్రం సేఫ్‌గా ఉంటుంద‌నే విష‌యంలో పెద్ద‌లు ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. అందుక‌ని ఇంటి ద‌గ్గ‌రే వీరి పెళ్లిని ప్ర‌భుత్వ విధి విధానాల‌తో పూర్తి చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. మ‌రి చివ‌ర‌కు పెద్ద‌లు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.