విరుచుకుపడిన వైసీపీ కార్యకర్తలు.. ఇక ట్వీట్ చేయనన్న రామ్

  • IndiaGlitz, [Sunday,August 16 2020]

ఒక్కసారిగా సంచలన ట్వీట్లు చేసి ఒక్కసారిగా టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన హీరో రామ్.. అంతే స్పీడుగా ఇక ఈ అంశంపై తానేమీ మాట్లాడబోనని తేల్చి చెప్పేశాడు. దీనికి కారణం రామ్‌పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడటమేనని తెలుస్తోంది. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై మూడు వరుస ట్వీట్లను రామ్ చేశాడు. జగన్ వెనుక పెద్ద కుట్ర జరుగుతోందని.. ఆయన రెప్యుటేషన్‌ను దెబ్బతీసే ప్రయత్నం జరగుతోందని రామ్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు విజయవాడ పోలీసులు కూడా.. రామ్ ట్వీట్‌ల‌పై స్పందించారు. తమ విచారణకు ఆటంక కలిగిస్తే నోటీసులు పంపుతామని తెలిపారు.

ఈ వ్యవహారంపై వైసీపీ కార్యకర్తలు సైతం ఘాటుగానే స్పందించారు. సోషల్ మీడియా వేదికగా రామ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రమేష్ హాస్పిటల్ ఎండీ రమేష్ చౌదరి అన్న కుమారుడే రామ్ అని.. అందుకే తన బాబాయిని వెనుకేసుకొస్తూ ఈ ట్వీట్‌లన్నీ చేశాడని ఆరోపణలు గుప్పించారు. రమేష్ చౌదరి ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు పరారీలో ఉన్నాడని.. ప్రభుత్వానికి సహకరించి ఉంటే బాగుండేదంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ‘రామ్ పోతినేని.. నీ ఇస్మార్ట్ తెలివితేట‌లు సినిమాల్లో చూపించు.. మా దగ్గర కాదు’ అని సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు కామెంట్లు పెట్టారు.

అటు పోలీసులతో పాటు.. ఇటు వైసీపీ కార్యకర్తలు సైతం ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవడం వల్లనో ఏమో కానీ రామ్ తాజాగా మరో ట్వీట్ చేశాడు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై తాను మరోసారి ట్వీట్ చేయనని ప్రకటించాడు. ‘‘నాకు న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉంది. నిజమైన దోషులు ఎవరైనా కచ్చితంగా శిక్షించబడతారు. వారు ఎవరికి చెందిన వారైనా.. చెందకున్నా సంబంధం లేదు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇక ట్వీట్లు చేయాలనుకోవడం లేదు. ఎందుకంటే, నేను చెప్పాల్సిందంతా ఇప్పటికే చెప్పేశాను. జైహింద్’’ అని రామ్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.