చ‌ర‌ణ్‌.. సెంటిమెంట్‌కు బ్రేక్ వేస్తాడా?

  • IndiaGlitz, [Friday,April 13 2018]

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా  ‘చిరుత’ (2007) సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఆ తర్వాత 2009, 2010, 2012 సంవ‌త్స‌రాలలో ఒక్కొక్క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చరణ్.. 2013లో కెరీర్‌లోనే తొలిసారిగా ‘నాయక్’, ‘జంజీర్’ (తుఫాన్‌) అంటూ రెండు సినిమాలతో సందడి చేశారు.

అందులో ఒకటి తెలుగు చిత్రం కాగా.. మరొకటి ద్విభాషా చిత్రం. వీటిలో వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ‘నాయక్’ ఘన విజయం సాధించింది. అలాగే.. 2014లో కూడా ‘ఎవడు’, ‘గోవిందుడు అందరివాడేలే’ అనే రెండు సినిమాలు రిలీజ్ కాగా.. ‘ఎవడు’ ఒక్కటే బాక్సాఫీస్ దగ్గర సందడి చేయగలిగింది. అంటే ఏడాదిలో చరణ్ సినిమాలు రెండు విడుదలైతే.. ఒక్క చిత్రాన్ని మాత్రమే విజయం వరిస్తూ వచ్చింది.

ఈ నేప‌థ్యంలో.. దాదాపు నాలుగేళ్ళ త‌రువాత ఈ ఏడాదిలోనూ రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌నున్నారు చెర్రీ.  ఈ ఏడాది ఇప్పటికే ‘రంగస్థలం’తో ఘన విజయాన్ని అందుకున్న చరణ్..  ద‌స‌రాకి బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేయబోయే సినిమాతో ప‌ల‌క‌రించ‌నున్నారు. ఈ సారి కూడా విజయాన్ని నమోదు చేసుకుని.. పాత సెంటిమెంట్‌కు ఫుల్ స్టాప్ పెడతారో లేదా దాన్నే కంటిన్యూ చేస్తారో వేచి చూడాలి.