ట్రోల్స్‌కు రాజమౌళి కౌంటర్

దర్శకధీరుడు రాజమౌళి క్వారంటైన్ టైమ్‌లో కావాల్సినన్ని ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఇదే ఈయనకు కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టాయి. ఎందుకంటే ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆస్కార్ విన్నింగ్ కొరియన్ మూవీ పారసైట్ గురించి మాట్లాడుతూ, తనకు ఆ సినిమా నచ్చక కునుకు తీశానని చెప్పుకొచ్చారు. దీంతో రాజమౌళిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఒరిజినల్ కంటెంట్‌తో రూపొందిన పారసైట్‌ను ఎలా విమర్శిస్తావు అంటూ పలువురు రాజమౌళిని విమర్శించారు. నెటిజన్స్ దర్శకధీరుడిని ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఆయన సినిమాల్లోని సన్నివేశాలు కాపీ అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఈ విమర్శలకు రాజమౌళి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.

‘‘గతంలో ఆస్కార్ విజేతలుగా నిలిచిన చిత్రాల్లో కొన్ని తనకు నచ్చాయి.. మరికొన్ని నచ్చలేదు. ఆస్కార్ అవార్డ్స్ జ్యూరీలోనూ లాబీయింగ్ జరుగుతుంది. జ్యూరీ సభ్యులు మన సినిమాను చూడాలంటే చాలా తతంగమే జరపాల్సి ఉంటుంది. అయితే జ్యూరీ కొన్ని ప్రమాణాలు పాటిస్తుంది. ఏదో సినిమాను పాస్ చేసి అవార్డ్ ఇవ్వదు కాబట్టి జ్యూరీపై నమ్మకంగా ఉన్నారందరూ’’ అన్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’. టాలీవుడ్ టాప్ స్టార్స్ తారక్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తుండటంతో బాలీవుడ్ యాక్టర్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్‌లతో పాటు హాలీవుడ్ స్టార్స్ ఆలిసన్ డూడీ, రే స్టీవెన్ సన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.