డ‌బ్బింగ్ చెప్పుకుంటున్న రాజ్ త‌రుణ్‌

  • IndiaGlitz, [Wednesday,June 27 2018]

‘ఉయ్యాలా జంపాలా’, 'సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21ఎఫ్’ లాంటి రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్‌ల‌తో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్. త‌న గత చిత్రాలు ‘రంగులరాట్నం’, ‘రాజుగాడు’ ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో.. త‌దుప‌రి చిత్రం 'ల‌వ‌ర్' పైనే ఆశ‌లు పెట్టుకున్నారు ఈ యంగ్ హీరో. అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమ‌క‌థా చిత్రంలో రిద్ధి కుమార్ కథానాయికగా న‌టించింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. అందులో భాగంగా.. రాజ్ తరుణ్ తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.

కాగా.. ఈ సినిమాకి అంకిత్ తివారి, ఆర్కో, రిషిరిచ్, అజయ్ వాస్, సాయి కార్తీక్, తనిష్క్ బాగ్చి.. ఇలా ఐదు మంది సంగీత ద‌ర్శ‌కులు సంగీతం అందించడం విశేషం. జూలై 12న విడుదల కానున్న ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించారు. ఇంతవరకు ‘దిల్’ రాజు నిర్మాణంలో తొలిసారిగా నటించిన హీరోలందరూ సింహభాగం విజయాన్ని అందుకున్నవారే. మరి విజయం కోసం తపిస్తున్న రాజ్ తరుణ్ కూడా విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.