Radha vs Uma: విజయవాడ టీడీపీలో సోషల్ మీడియా వార్.. రాధా వర్సెస్ ఉమా..

  • IndiaGlitz, [Wednesday,January 24 2024]

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో కీలకమైన విజయవాడ రాజకీయాలు కాక రేపుతున్నాయి. విజయవాడ సెంట్రల్ సీటు కోసం మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధా(Vangaveeti Radhakrishna), బోండా ఉమా(Bonda Uma) వర్గీయుల మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. వంగవీటి రాధాను టీడీపీ అధిష్టానం నమ్మడం లేదంటూ ఏడు ప్రశ్నలతో బోండా ఉమా వర్గీయులు ఇటీవల పోస్టులు పెట్టారు.

ఉమా వర్గీయుల ప్రశ్నలు..

గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు తెలుగుదేశం పార్టీ తరపున రాధా మాట్లాడలేదు. గుడివాడలో జరిగిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి సభకు చంద్రబాబు చెప్పినా ఆయన మిత్రుడు కొడాలి నాని రావొద్దన్నాడని పాల్గొనలేదు. యువగళం పాదయాత్రలో విజయవాడలో లోకేశ్‌కు కనిపించి.. తన మిత్రుడు వల్లభనేని వంశీ రావొద్దన్నాడని గన్నవరం సభకు హాజరుకాలేదు. చంద్రబాబు ఇంటిపై దాడి జరిగినా.. మంగళగిరిలో పార్టీ ఆఫీసుపై దాడి జరిగినా కనీసం స్పందించలేదు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరినా ఇంతవరకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోలేదు. ఇపుడు కూడా నాని, వంశీలతో కలిసే ఉండటం.. కాశీకి వెళ్లడం చేశారు. టీడీపీ శత్రువులతో తిరగడంతోనే రాధాను పార్టీ నమ్మకపోవడానికి కారణం అంటూ ప్రశ్నలు వేశారు. దీంతో ఈ పోస్టులు వైరలయ్యాయి.

రాధా వర్గీయుల కౌంటర్ ప్రశ్నలు..

ఈ పోస్టులకు కౌంటర్‌గా రాధా వర్గీయులు ఉమాకు వ్యతిరేకంగా 17 ప్రశ్నలతో పోస్టులు పెట్టారు. పదవి కోసం పార్టీని బెదిరించాలా..? దేవుడి పేరుతో చందాలు పోగు చేసి దోచేయాలా ? స్థలాలు కబ్జా చేయాలా ? చిన్నపిల్లల చావుకు కారణం అవ్వలా ? కాల్ మన నిందితులకు కొమ్ముకాయాలా ? కల్తీ మద్యం కేసులో నిందితులకు కొమ్ముకాయాలా ? రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి వెన్నుపోటు పొడవలా? కులాన్నిఅధికారాన్ని అడ్డు పెట్టుకొని కోట్లు సంపాదించాలా ? పార్టీ మీద, పార్టీ నాయకుల మీద పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించాలా ? పార్టీలో ఉన్న నాయకులను వాడుకొని వదిలేయాలా ? కార్పొరేటర్ల టికెట్లు అమ్ముకోవాలా..? అంటూ పోస్టులు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టులు బెజవాడ టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

సీటు ఆశిస్తున్న రాధా, ఉమా..

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ కోసం రాధా, ఉమా ఇద్దరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తు్న్నారు. అధిష్టానం మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలోనే ఇద్దరు నేతలకు చెందిన వర్గీయులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. 2009లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఏర్పడగా ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసినా రాధా.. కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు. 2014లో టీడీపీ తరపున మల్లాది విష్ణుపై బోండా ఉమా గెలిచారు. ఇక 2019లో మల్లాది విష్ణుపై కేవలం 25 ఓట్ల తేడాతో ఉమా ఓడిపోయారు. ఈసారి కూడా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే రాధా కూడా ఈసారి సీటును ఆశిస్తున్నారు. దీంతో అక్కడ కోల్డ్ వార్ నడుస్తోంది.

అధిష్టానం ఎలా స్పందిస్తుందో..?

అయితే ఇటీవల వంగవీటి రాధా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. వైసీపీ నేతలు టచ్‌లోకి వెళ్లారని.. ముఖ్యంగా ఆయన స్నేహితులు కొడాలి నాని, వల్లభనేని వంశీ పార్టీలోకి ఆహ్వానించారనే వాదన తెరపైకి వచ్చింది. అయితే రాధా ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు. తాను టీడీపీలోనే ఉంటానని స్పష్టంచేశారు. ఈ క్రమంలో వంగవీటి రాధాను పార్టీ నమ్మడం లేదని బోండా ఉమా వర్గీయులు పోస్టులు పెట్టడం.. వాటికి కౌంటర్‌గా రాధా వర్గీయులు పోస్టులు పెట్టడం సంచలనంగా మారాయి. దీంతో ఈ పోస్టులపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.