Purandeswari:అమిత్‌ షా- లోకేశ్‌ భేటీలో ఇదే జరిగింది..? క్లారిటీ ఇచ్చిన పురందేశ్వరి

  • IndiaGlitz, [Saturday,October 14 2023]

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయంపై ఇటీవల కేంద్ర హోంమంత్రితో నారా లోకేశ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ అనంతరం లోకేశ్‌ మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తనకు ఫోన్ చేసి అమిత్ షా పిలుస్తున్నారని.. అందుకే ఆయనతో భేటీ అయ్యానని తెలిపారు. దీనిపై వైసీపీ నేతలు సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలో అమిత్‌ షా- లోకేశ్‌ భేటీపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మీడియా వేదికగా స్పందించారు. లోకేష్‌ను అమిత్‌షా పిలిచారా..? లేక లోకేష్ అడిగారా..? అనేది అప్రస్తుతమన్నారు. వారిద్దరి భేటీ అయితే జరిగింద కదా అని తెలిపారు. ఈ భేటీలో చంద్రబాబుపై ఏయే కేసులు పెట్టారు..? కోర్టు్లో ఏయే బెంచ్‌ల మీదకు కేసులు వెళ్లాయని అమిత్ షా అడిగారని ఆమె క్లారిటీ ఇచ్చారు.

చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదు..

అలాగే బాబు అరెస్ట్‌పై స్పందిస్తూ మాజీ సీఎం అయిన చంద్రబాబుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదనేది తమ అభిప్రాయని పేర్కొన్నారు. చంద్రబాబుపై నమోదైన కేసుల్లో వాస్తవం ఏంటో తేల్చాల్సింది కోర్టులని చెప్పారు. కేసులు కోర్టుల్లో ఉన్నాయి కాబట్టి.. దీనిపై ఎక్కువ స్పందించలేమన్నారు. అయితే బాబును అరెస్ట్ చేయగానే ఖండిస్తూ ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేసిన విషయం విధితమే.

మద్యం తయారీ కంపెనీల యజమానుల పేర్లు బయటపెట్టాలి..

అనంతరం ప్రభుత్వ అవినీతిపై మాట్లాడుతూ ఏపీలో మద్యం తయారీ కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా? అని ప్రశ్నించారు. మద్యం తయారుచేసే కంపెనీల యజమానులంతా వైసీపీ వారేనని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ధైర్యం ఉంటే మద్యం కంపెనీల యజమానుల పేర్లన్నీ బయటపెట్టాలని సవాల్‌ విసిరారు. మద్యం తయారు చేసినా.. అమ్మినా ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని గతంలో ప్రతపక్షనేతగా జగన్‌ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై తన నిజాయతీని నిరూపించుకోవాలంటే సీబీఐ విచారణకు సీఎం జగన్ అంగీకరించాలని పురందేశ్వరి ఛాలెంజ్ విసిరారు.