TDP Protest: మెట్రో సాక్షిగా నవ్వులపాలైన టీడీపీ పెయిడ్ ఆర్టిస్టుల నిరసన

  • IndiaGlitz, [Saturday,October 14 2023]

స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాంలో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా ఆ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్న నిరసనలు ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయి. అవినీతి కేసులో బాబును అరెస్ట్ చేసిన కొత్తలో హైదరబాద్‌ ఐటీ క్యాడర్‌లోని సైబర్ టవర్స్‌తో పాటు దేశ, విదేశాల్లో టీడీపీ మద్దతుదారులు చేసిన హడావిడి అంత ఇంత కాదు. ఈ హడావిడి చూసి జనాలు ముక్కున వేలుసుకున్నారు. నెల రోజులకు పైగా జైల్లో ఉన్న చంద్రబాబుకు మద్దతుగా ఈసారి పదేళ్ల వయసున్న పిల్లలను సైతం రంగంలోకి దించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

మెట్రోలో ఆందోళనపై ప్రయాణికుల ఆగ్రహం..

శనివారం ఉదయం ఏకంగా తమ ఆందోళనకు హైదరాబాద్‌లోని మెట్రో రైలును వేదికగా చేసుకుని కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు హల్ చల్ చేశారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో స్టేషనల్లో ఆందోళనకు దిగారు. వీరిలో అరవై ఏళ్లకు దగ్గరగా ఉన్నవారు కూడా ఐటీ ఉద్యోగులు అని చెప్పుకోవడం గమనార్హం. నల్ల చొక్కాలు వేసుకుని నేరుగా మియాపూర్ వద్ద మెట్రో ట్రైన్లో చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేయడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు.. అయన అంశం కోర్టులో ఉంది.. ఇక్కడ కేకలు వేసి ఆందోళన చేస్తే ఎలా? అని నిలదీశారు.

స్కూలు పిల్లలకు రాజకీయాలతో ఏం సంబంధమని నిలదీత..

నేను కూడా విజయవాడ వాడినే. ఎక్కడ నిరసన తెలపాలో అక్కడే చేయండి.. ఇక్కడ కాదు. అయినా న్యాయ ప్రక్రియ జరుగుతుంది కదా అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మద్దతుదారుల వ్యవహారం చూసి మెట్రో ప్రయాణీకులు సైతం అసలు కోర్టులో ఉన్న అంశం గురించి బయట ఆందోళన చేయడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. దీంతో సానుభూతిపరులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ఇదిలా ఉండగా ఈ ఆందోళనకు స్కూలు పిల్లలను కూడా నల్ల దుస్తుల్లో తీసుకొచ్చారు కొంతమంది. అసలు పిల్లలకు ఈ రాజకీయాలతో ఏమి సంబంధం.. ఆ మాత్రం ఇంగితం తల్లిదండ్రులకు ఉండొద్దా అని కొందరు ప్రయాణికులు ప్రశ్నించారు. మొత్తానికి చంద్రబాబుకు మద్దతుగా ఏదో హడావిడి నిరసన చేద్దామకున్న టీడీపీ మద్దతుదారుల ఆందోళన పది మందిలోనూ మెట్రో సాక్షిగా నవ్వులపాలైంది.

లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ కార్యక్రమంలో పోలీసులతో వాగ్వాదం..

కాగా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ కార్యక్రమం చేపట్టారు. టీడీపీ సానుభూతిపరులు చంద్రబాబుకు మద్దతుగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు నల్ల టీషర్ట్‌లతో ప్రయాణంకు భారీగా చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మియాపూర్ మెట్రో స్టేషన్‌ చేరుకుని స్టేషన్‌ మూసివేశారు. నిరసనలకు అనుమతి లేదని నల్ల టీషర్టులు ధరించిన ప్రయాణికులను స్టేషన్ నుంచి బయటకు పంపివేశారు. దీంతో పోలీసులు, చంద్రబాబు మద్దతుదారులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.