Bigg Boss Telugu 7 : పుంజుకున్న అమర్‌దీప్.. వెనుకబడ్డ అర్జున్, పోటీ నుంచి తప్పుకున్న యావర్ , ‘‘ లక్ ’’ లేదంటూ కంటతడి

  • IndiaGlitz, [Friday,December 01 2023]

బిగ్‌బాస్ 7 తెలుగు తుది అంకానికి చేరుకుంది. ప్రస్తుతం హౌస్‌లో కంటెస్టెంట్స్ అంతా ఫినాలే అస్త్ర కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు పెట్టిన టాస్కుల్లో కొందరు మధ్యలోనే ఆగిపోయారు. ఇప్పటికే శివాజీ, శోభా, ప్రియాంక తప్పుకోగా .. శివాజీ, శోభాలు తాము సాధించిన పాయింట్స్‌ను అమర్‌దీప్‌కు ఇచ్చారు. దీంతో గేమ్ ఆడకపోయినప్పటికీ అమర్ టాప్‌ 5లో వుంటున్నాడు. ప్రస్తుతం అమర్‌దీప్, అర్జున్, గౌతమ్, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ మాత్రమే మిగిలారు. ఈ రోజు టాస్క్‌లు ఆసక్తికరంగా సాగాయి.

ఫినాలే అస్త్ర కోసం ఆరో టాస్క్‌లో భాగంగా టాప్ 5లో నిలిచిన ఐదుగురు కంటెస్టెంట్స్‌కు టర్నింగ్ వికెట్ అనే క్రికెట్‌కు సంబంధించిన టాస్క్ ఇచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పిచ్‌పై వికెట్స్ తిరుగుతూ వుంటాయి. ఫీల్డర్లుగా వున్న కంటెస్టెంట్స్ బయటి నుంచి రింగులు వికెట్ల మీదకు విసరాల్సి వుంటుంది. ఎవరికైతే ఎక్కువ రింగులు పడతాయో వారే విజేత. ఈ టాస్క్‌లో అమర్‌దీప్ టాప్‌లో నిలవగా.. అర్జున్ సెకండ్ ప్లేస్ కొట్టేశాడు.

ఫినాలే అస్త్ర కోసం బిగ్‌బాస్ ఇచ్చిన ఏడవ ఛాలెంజ్ ‘‘తప్పించుకో రాజా’’ . దీనిలో భాగంగా టాప్ 5లో వున్న ఐదుగురు కంటెస్టెంట్స్ ఖైదీల మాదిరిగా డ్రెస్సులు వేసుకుని జైలు నుంచి తప్పించుకోవాల్సి వుంటుంది. వారికి ఏర్పాటు చేసిన సొరంగం నుంచి ఇసుకను తవ్వుతూ బయటికి రావాల్సి వుంటుంది. ఆ తర్వాత వారికి కాలికి వేసిన తాళాన్ని తొలగించుకోవాలి. అయితే ఆ తాళం కూడా వారే వెతికి పట్టుకుని గంట కొట్టాలి. తొలుత ఎవరు బెల్ కొడతారో వారికే ఎక్కువ పాయింట్లు లభిస్తాయి. ఇప్పటి వరకు ఫినాలే అస్త్ర కోసం ఇచ్చిన ప్రతి గేమ్‌లోనూ దుమ్మురేపిన అర్జున్.. ఇందులో వెనకబడ్డాడు. పల్లవి ప్రశాంత్ అద్భుతంగా ఆడి విజయం సాధించాడు.

అమర్‌దీప్ తాళం చెవులను చెల్లాచెదురుగా పడేయటంతో అర్జున్ బయటకు రావడం కష్టమైంది. తాను లేట్‌గా టాస్క్ ఫినిష్ చేయడానికి యావరే కారణమని , సంచాలకులు కూడా దానిని గమనించలేదని ఫైర్ అయ్యాడు. ఈ టాస్క్‌లో అందరికంటే తక్కువ పాయింట్లు సాధించిన ప్రిన్స్ యావర్‌ ఫినాలే అస్త్ర నుంచి తప్పుకున్నాడు. తాను బాగా ఆడినా పాయింట్స్ సంపాదించలేకపోయానని.. తనకు లక్ కలిసి రావడం లేదని బాధపడ్డాడు. రూల్స్ ప్రకారం తన పాయింట్స్‌లోని సగం మొత్తాన్ని మరొకరికి ఇవ్వాల్సి వుంటుంది. దీంతో యావర్ మరో ఆలోచన లేకుండా ప్రశాంత్‌ అనేశాడు.

అనంతరం టాప్ 4 లో నిలిచిన అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్, గౌతమ్, అర్జున్‌లకు ‘‘పట్టుకో తెలుసుకో’’ అనే టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం ఈ నలుగురి కళ్లకు గంతలు కట్టి వుంటాయి. వారి ముందు వుంచిన బాక్స్‌ల్లో సంచాలకులు ఏవేవో వస్తువులు పెడుతూ వుంటారు. కంటెస్టెంట్స్ వాటిని చేతితో తాకుతూ సరిగ్గా గెస్ చేసి చెప్పాలి. అర్జున్ ఇక్కడా వెనకబడగా.. ప్రశాంత్, అమర్‌దీప్‌లు బాగా ఆడారు. అర్జున్ బాగా డిజప్పాయింట్ కావడమే కాకుండా.. ఈ రౌండ్ నేను కూర్చొని చూస్తాను అంటూ అడగటంతో అంతా నవ్వుకున్నారు. అయితే అమర్‌దీప్ ప్రతిదానికి టకటకా ఆన్సర్లు చెప్పేస్తూ వుండటంతో అతను కట్టుకున్న గంతలను చెక్ చేశాడు యావర్. ఇది 100 శాతం కనిపిస్తోందని శివాజీకి చెప్పడంతో అమర్‌ ఫైర్ అయ్యాడు. నేను ఆడినప్పుడు, నాకు పాయింట్స్ వచ్చినప్పుడు ఈ డౌట్లు వస్తాయని కామెంట్ చేశాడు.

తొమ్మిదవ గేమ్‌లో అయినా పాయింట్స్ సాధించాలని కసిగా వున్నాడు అర్జున్. ‘‘బ్యాలెన్స్ ది బాల్’’ పేరుతో ఇచ్చిన ఈ టాస్కులో కంటెస్టెంట్స్ ఒక చేతిలో బాల్ పట్టుకుని వుండాలి. వారి కాళ్లు నేలకు తాకకుండా ఒక నీళ్ల బకెట్‌కు తాడును కట్టి.. దానిని వారి కాళ్లకు కట్టేస్తారు. అలా ఎక్కువ సేపు ఎవరైతే బాల్‌ను బ్యాలెన్స్ చేస్తారో వారే విజేత. ఈ గేమ్‌లో అమర్, గౌతమ్‌లు ఎలిమినేట్ అవ్వగా.. అర్జున్ చివరి వరకు జాగ్రత్తగా ఆడి పొరపాటున చేయి కిందపెట్టడంతో ఔట్ అయిపోయాడు. చివరికి మన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఇప్పటి వరకు పెట్టిన అన్ని గేమ్స్‌ల్లో పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్‌కు పాయింట్స్ సమానంగా వున్నాయి.