Namo Bharat: 'నమో భారత్' ర్యాపిడ్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. ట్రైన్‌లో ప్రయాణం..

  • IndiaGlitz, [Friday,October 20 2023]

దేశంలో తొలి సెమీ హైస్పీడ్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్‌ స్టేషన్‌లో ఢిల్లీ-ఘజియాబాద్‌-మీరట్ రీజినల్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌(RRTS) కారిడార్‌లో ఈ రైలు పరుగులు పెట్టింది. రైలును ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ అందులో ప్రయాణిస్తూ స్కూల్ విద్యార్థులు, రైలు సిబ్బందితో ముచ్చటించారు. ఈ రైళ్లకు నమో భారత్ అనే పేరు పెట్టారు. సాహిబాబాద్ నుంచి దుహై డిపో మధ్య ఉన్న 80 కిలోమీటర్ల దూరంలో ఈ ర్యాపిడ్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

రూ.30వేల కోట్లు ఖర్చుతో ప్రాజెక్ట్..

2019 మార్చి 8వ తేదీన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌కి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ.30వేల కోట్లు ఖర్చుతో దాదాపు ఐదు సంవత్సరాల పాటు కష్టపడి ఈ మొత్తం కారిడార్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పనులు పూర్తి కావడంతో తాజాగా దీనిని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమలో యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. గంటకు 180 కి.మీ.గరిష్ఠ వేగంతో దూసుకెళ్లేలా తీర్చిదిద్దిన ఈ రైలులో అధునాతన సదుపాయాలు ఉంటాయి.

నమో భారత్‌ రైళ్లలో అన్నీ ఏసీ కోచ్‌లే..

ఈ కారిడార్‌లో సాహిబాబాద్‌-దుహై డిపో మధ్య ముందుగా 17 కిలోమీటర్లు దూరానికి ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈ రెండింటి మధ్య అయిదు స్టేషన్లు ఉంటాయి. నమో భారత్‌ రైళ్లలో అన్నీ ఏసీ కోచ్‌లే ఉంటాయి. ప్రతి రైలులో 2+2 తరహాలో సీట్లు ఉంటాయి. నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, సామాన్లు ఉంచేందుకు ఓవర్‌హెడ్‌ లగేజ్ ర్యాక్స్‌ , సీసీటీవీ కెమెరాలు, వైఫై, ఎమర్జెన్సీ డోర్స్, లాప్‌టాప్‌/మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, రూట్‌మ్యాప్‌లు, ఫుట్‌రెస్ట్‌లు, కోట్ హ్యాంగర్స్ వంటి ఆధునాతన సదుపాయాలు కల్పించారు. ప్రతి రైలులో ఆరు కోచ్‌లు ఉంటాయి. స్టాండర్డ్ కోచ్‌లలో 72, ప్రీమియం తరగతిలో 62 సీట్లు చొప్పున ఉంటాయి. నిలబడి ప్రయాణించే వారితో కలిసి ఒకేసారి 1,700 మంది వీటిలో ప్రయాణించవచ్చు.

ప్రతి రైలులో మహిళలకు ఓ కోచ్‌..

స్టాండర్డ్ కోచ్‌లలో టికెట్ ధర రూ.20-50 మధ్య, ప్రీమియం కోచ్‌లలో రూ.40-100 మధ్య ఉంటుంది. ప్రతి రైలులో మహిళలకు ఒక కోచ్‌ను కేటాయించారు. అలాగే మహిళలు, దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రతి కోచ్‌లోనూ కొన్నిసీట్లను కేటాయించారు. ప్రీమియం కోచ్‌లో ప్రయాణికులకు సహాయపడేందుకు ఒకరు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఈ రైళ్లు ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు సేవలందిస్తాయి. పావుగంటకు ఒకటి చొప్పున నడుస్తాయి. 2025 జూన్ నాటికి మిగతా రూట్‌లలోనూ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.