Prime Minister Modi:హైదరాబాద్ రానున్న ప్రధాని మోదీ.. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు..

  • IndiaGlitz, [Tuesday,May 07 2024]

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. పోలింగ్‌కు కేవలం ఆరు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఇప్పటికే ఓ విడత రాష్ట్ర పర్యటనకు వచ్చి ప్రచారం చేశారు. తాజాగా మరోసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు పీఎంవో ఆఫీస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఇవాళ(మంగళవారం) రాత్రి హైదరాబాద్ రానున్నారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. బేగంపేట నుంచి రాజ్‌భవన్ మార్గంలో ఈరోజు రాత్రి, రేపు ఉదయం ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈరోజు రాత్రి 7.50 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకోనున్న మోదీ.. అక్కడి నుంచి రాజ్ భవన్‌కు వెళ్లనున్నారు. దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 7.50 గంటల నుంచి 8.25 గంటల వరకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మోనప్ప ఐలాండ్, రాజ్ భవన్ వరకు వాహనాలను అనుమతించరు.

అలాగే రేపు(బుధవారం) ఉదయం రాజ్ భవన్ నుంచి తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌కు మోదీ వెళ్లనున్నారు. దీంతో రేపు ఉదయం 8.35 నుంచి 9.10 వరకు రాజ్ భవన్, మోనప్ప ఐలాండ్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్ ఎయిర్ పోర్ట్ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనరులకు ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

కాగా రేపు ఉదయం 11 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మోదీ దర్శించుకోనున్నారు. అనంతరం వేములవాడతో పాటు వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. తిరిగి 10వ తేదీ మహబూబ్‌నగర్‌తో పాటు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలోనూ పాల్గొననున్నారు. మరోవైపు మూడో విడతలో భాగంగా గుజరాజత్‌లో జరిగిన పోలింగ్‌లో ప్రధాని మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు .