15 ఏళ్లు పూర్తిచేసుకున్న ప్ర‌భాస్‌

  • IndiaGlitz, [Saturday,November 11 2017]

ప్ర‌భాస్‌.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరిది. బాహుబ‌లి, బాహుబ‌లి 2 చిత్రాల‌తో వ‌రల్డ్ వైడ్‌గా ఫేమ‌స్ అయిన మ‌న తెలుగు క‌థానాయ‌కుడు ప్ర‌భాస్‌. అలాంటి ప్ర‌భాస్ కి ఇవాళ ఎంతో స్పెష‌ల్‌. ఎందుకంటే.. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన తొలి చిత్రం 15 ఏళ్ల క్రితం ఇదే తేదిన ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది మ‌రి. ఈశ్వ‌ర్ పేరుతో విడుద‌లైన ఆ సినిమాలో ప్ర‌భాస్.. ధూల్ పేట్ కుర్రాడిగా మాస్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు.

అప్ప‌టికే చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున వంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసిన జ‌యంత్ సి.ప‌రాన్జీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం.. అప్ప‌ట్లో ఓ సెన్సేష‌న‌ల్ న్యూస్ అయ్యింది. ప్ర‌ముఖ న‌టులు విజ‌య్ కుమార్‌, మంజుల కుమార్తె శ్రీ‌దేవి క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టి రేవ‌తి కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ సంగీత‌మందించిన ఈ చిత్రం.. న‌వంబ‌ర్ 11, 2002న విడుద‌లైంది.

తొలి చిత్రంతోనే రొమాన్స్‌, ఫైట్స్‌, డ్యాన్స్‌, యాక్టింగ్‌.. ఇలా అన్ని అంశాల్లోనూ మెప్పించిన ప్ర‌భాస్‌.. బాహుబ‌లితో ఊహ‌కంద‌ని స్థాయికి ఎదిగారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ సాహో చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది. వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రంతో.. ప్ర‌భాస్ స్థాయి మ‌రింత పెరుగుతుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.