ప్రాజెక్ట్ కే : ప్రభాస్-దీపికా పదుకొణే- అమితాబ్‌ల బిగ్గెస్ట్‌ మూవీ స్టార్ట్.. ఫస్ట్ షార్ట్ వీడియో వైరల్

  • IndiaGlitz, [Saturday,December 11 2021]

వరుస సినిమాలతో బిజీగా వున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘‘ప్రాజెక్ట్ కే’’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్‌ను స్టార్ట్ చేశాడు. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకోణే హీరోయిన్‌గా నటిస్తుండగా... బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ని చిత్ర యూనిట్ శనివారం ప్రారంభించింది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా చిత్రీకరణ స్టార్ట్ అయినట్టు చిన్న క్లిప్‌ని పంచుకుంది నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. దర్శకుడు నాగ్ అశ్విన్ రోల్‌ కెమెరా.. స్టార్ట్ అనగా, ప్రభాస్‌ తన చేయి అందించగా.. కింద నుంచి దీపికా పదుకొనె చేయి అందుకుంది. 'ఇండియన్‌ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్‌ ప్రభాస్‌, దీపికా పదుకొనె కలిసి వరల్డ్ బిగ్గెస్ట్ కెమెరా ముందుకు.. 'అని చెబుతూ ఈ వీడియోని పంచుకున్నారు. సైన్స్ ఫిక్షన్‌గా ప్రాజెక్ట్ కేను తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్‌.. 'రాధేశ్యామ్‌' చిత్రంలో నటిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా రూపొందుతుంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న రాధేశ్యామ్‌ విడుదల కానుంది. వీటితోపాటు 'సలార్‌', 'ఆదిపురుష్‌' చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్‌. 'ఆదిపురుష్‌'ను వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్నారు. ఇందులో కృతి సనన్‌ సీతగా, సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడి పాత్రని పోషిస్తున్నారు. మరోవైపు కేజీఎఫ్ ఫేం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న 'సలార్‌'లో శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తుంది. అలాగే ప్ర‌భాస్ త‌న 25వ చిత్రం ‘‘స్పిరిట్‌’’ను సెట్స్‌పైకి తీసుకెళ్ల‌ే ప్లాన్‌లో వున్నారు. అర్జున్ రెడ్డి దర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.