MM Keeravani : సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి మాతృవియోగం... పవన్ కల్యాణ్ సంతాపం

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి భానుమతి బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భానుమతి మరణంతో కీరవాణి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు కీరవాణికి సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కీరవాణి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

కీరవాణికి పవన్ కల్యాణ్ సంతాపం :

‘‘ ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ కీరవాణి గారి మాతృమూర్తి శ్రీమతి భానుమతి గారు కన్ను మూశారని తెలిసి చింతించాను. శ్రీమతి భానుమతి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. భానుమతి గారు భర్త శ్రీ శివశక్తి దత్తగారికి, ఆమె తనయుడు శ్రీ కీరవాణి గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను ’’ అని పవన్ పేర్కొన్నారు.

కీరవాణి కుటుంబమంతా సినీ రంగంలోనే :

ఇక కీరవాణి తండ్రి శివశక్తి దత్త రచయిత అన్న్ సంగతి తెలిసిందే. ఆయన పిల్లలంతా సినీ రంగంలో స్ధిరపడిన వారే. కీరవాణి తమ్ముడు కళ్యాణి మాలిక్, సోదరి ఎంఎం శ్రీలేఖలు కూడా సంగీత దర్శకులే. అటు మనుమడు, కీరవాణి కుమారు కాలభైరవ కూడా సంగీత దర్శకుడిగా, గాయకుడిగా రాణిస్తున్నారు. అటు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ .. శివశక్తి దత్తకు స్వయానా సోదరుడు. జక్కన్న ఏ సినిమా చేసినా కీరవాణి కుటుంబం దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటుంది. కీరవాణి సతీమణి శ్రీవల్లి ప్రొడక్షన్ ఇతరత్రా వ్యవహారాలు పర్యవేక్షిస్తారు.