Pothina Mahesh:వైసీపీలో చేరిన పోతిన మహేశ్‌.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్‌..

  • IndiaGlitz, [Wednesday,April 10 2024]

జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా పెంటవారిపాలెం వద్ద 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర క్యాంప్‌లో సీఎం జగన్ ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహేశ్‌తో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మహేశ్‌కు వైసీపీలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మైనార్టీ నేత ఆసిఫ్ బరిలో ఉన్నారు. దీంతో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కే అవకాశం లేదు. ప్రస్తుతానికి పార్టీ కోసం మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది.

కాగా రెండు రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేశ్.. పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ టీడీపీకి అమ్ముడుపోయారని.. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని.. త్వరలోనే ఆధారాలను బయపెడతానంటూ పేర్కొన్నారు. తన స్వార్థ రాజకీయాల కోసం కాపు యువతను మోసం చేయొద్దంటూ మహేశ్ సూచించారు. పార్టీ నిర్మాణం, క్యాడర్‌పై ఏనాడూ దృష్టి సారించలేదని విమర్శించారు. ఎన్నికల తరువాత పార్టీ పరిస్థితి ఏంటో చెప్పగలరా? పార్టీ కోసం పనిచేసిన వారికి ఎందుకు సీట్లు కేటాయించలేదని.. టీడీపీ వారికే ఎందుకు సీట్లు ఇచ్చారు? అని నిలదీశారు.

అయితే పోతిన వ్యాఖ్యలపై జనసేన నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా చాలా మందికి పార్టీ టికెట్లు రాలేదని.. అసంతృప్తిగా ఉన్నా సరే వైసీపీని ఓడించేందుకు అందరం కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మంచి పదవులు వస్తాయని పేర్కొంటున్నారు. కానీ మహేశ్ లాంటి నేతలు వైసీపీ ట్రాప్‌లో పడి పార్టీ అధినే పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. మరోసారి తమ నాయకుడిపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు బీజేపీకి వెళ్లడంతో అక్కడ నుంచి సీనియర్ నేత సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ని సంవత్సరాలు జనసేన పార్టీకి విధేయుడిగా ఉంటూ వచ్చిన మహేష్.. ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేయడం ప్రకంపనలు రేపుతోంది.