మాపై ఎందుకు ఇంత పగ.. చంద్రబాబుపై రగిలిపోతున్న పేద ప్రజలు..

  • IndiaGlitz, [Monday,April 01 2024]

టీడీపీ అధినేత చంద్రబాబుకు తొలి నుంచి పేదలంటే చులకనే. ఆయన ఎప్పుడూ పేద ప్రజల కోసం పాటుపడలేదు. కేవలం పెత్తందార్లు కోసమే తన పాలన సాగించేవారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ఏనాడూ పేదల గురించి ఆలోచించిందీ లేదు. ఇప్పుడు కూడా అదే అక్కసు వెళ్లగక్కారు. ఆయన చేసిన నిర్వాహకానికి ప్రజలు లబోదిబోమంటున్నారు. తమపై ఎందుకింత కక్ష అని రగిలిపోతున్నారు. తాము ఏం పాపం చేశామని ఇంత ఇబ్బంది పెడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెల్లారినా పింఛన్ రాలేదు..

తెల్లారింది... ఒకటో తేదీ వచ్చింది... ఎప్పట్లానే గుమ్మం ముందు నవ్వుతూ నిలబడి తాతా .. పెన్షన్ తీసుకో... అవ్వా వేలిముద్ర వేద్దువురా అని పిలిచే వాలంటీర్ లేడు.. రాలేదు. అసలు సంక్షేమం అంటేనే అసహ్యించుకునే చంద్రబాబు ఇప్పుడు సీఎం వైయస్ జగన్ సారధ్యంలోని ప్రభుత్వం చేస్తున్న మంచిని భరించలేకపోతున్నారు. ప్రతినెలా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంచే వాలంటీర్ల కాళ్లకు కోర్టుల సాయంతో బంధనాలు వేసి తాను గెలిచానని సంబర పడుతున్నారు. కానీ దీని వల్ల వృద్ధులు, వికలాంగులు ఈ మండుటెండల్లో ఎంత ఇబ్బంది పడతారన్నది ఆయనకు అర్థం కావడం లేదు.

మండుటెండల్లో నిలబడాలి..

చంద్రబాబు కుట్రవల్ల వారికి ఫస్ట్ తేదీన రావాల్సిన పెన్షన్ డబ్బులు చేతిలో పడలేదు. ఆయన చేసిన ఒక్క దురాలోచన మొత్తం లక్షలాదిమంది అవ్వాతాతల ఆశలు చిదిమేసింది. ఇప్పుడు మండుటెండల్లో అవ్వా తాతలు... వికలాంగులు సైతం సచివాలయాల వద్ద కాపు కాయాలి. దీంతో పాటు రేషన్ సరుకులు కూడా ఇళ్ల వద్ద ఇవ్వొద్దని అడ్డుకోవడంతో బియ్యం కోసం ప్రజలు రేషన్ డిపోల వద్ద గుమిగూడుతున్నారు. నిన్నటి వరకూ గుమ్మం ముందుకు పెన్షన్లు... బియ్యం.. పప్పులు వచ్చేవని.. ఇప్పుడు చంద్రబాబు చేసిన కుట్రలకు తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లక్షలాది మంది ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరిక..

చంద్రబాబు కుట్రల వల్ల ఇంటి వద్దనే పెన్షన్ తీసుకునే అవకాశం కోల్పోయిన వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబుకు చేయడం చేతకాదు.. చేస్తున్న జగన్ సర్కార్ చేతులు ఈసీ నిబంధనలతో కట్టేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు చంద్రబాబుకు మనసు లేదు... వయసు పెరిగినా బుద్ధి పెరగలేదు అని శాపనార్థాలు పెడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే చంద్రబాబు పాలన మళ్లీ వస్తే రాష్ట్రం మొత్తం అస్తవ్యస్థం అవుతుందని.. ఈసారి ఎన్నికల్లో తమ ఓటుతో మరోసారి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.