Bigg Boss 7 Telugu : మరోసారి లేడీ కంటెస్టెంటే.. బిగ్‌బాస్ నుంచి పూజా మూర్తి ఎలిమినేట్, హౌస్‌లోకి రతిక రీ ఎంట్రీ

  • IndiaGlitz, [Monday,October 23 2023]

బిగ్‌బాస్ హౌస్ 7లో ఆడవాళ్ల ఎలిమినేషన్ కొనసాగుతూనే వుంది. సీజన్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాలేదు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, శుభశ్రీ, రతిక, నయని పావనిలు ఎలిమినేట్ కాగా.. తాజాగా ఈ సెంటిమెంట్ కొనసాగిస్తూ పూజా మూర్తిని బయటికి పంపేశారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు రెండు వారాలకే హౌస్‌ను వీడింది. దీంతో మీకు ఆడవాళ్లే దొరుకుతున్నారా.. ఎలిమినేట్ చేయడానికి ఒక్క పురుష పుంగవుడు కూడా కనిపించడం లేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇక సండే అంటే ఫన్ డే అన్న సంగతి తెలిసిందే. అందులోనూ పండుగ సీజన్ కావడంతో కంటెస్టెంట్స్ అందంగా ముస్తాబయ్యారు. నాగార్జున సైతం అంతే కలర్‌ఫుల్‌గా రెడీ అయి వచ్చారు. ఇంటి సభ్యులకు దసరా శుభాకాంక్షలు చెప్పిన ఆయన దసరా అనే ఇంగ్లీష్ పదంలో ఆరు అక్షరాలు వున్నాయి కాబట్టి ఆరు గేమ్స్ పెడతానని చెప్పారు. ఇరు జట్లు చెరో మూడు గెలిచి సమంగా నిలిచాయి. ఇదే సమయంలో హీరోయిన్లు రెబా మోనికా జాన్, పాయల్ రాజ్‌పుత్, డింపుల్ హయాతిలు డ్యాన్స్‌తో ఇరగదీశారు. సింగర్స్ వాగ్దేవి, లాలస, శిరీష పాటలతో ఆకట్టుకున్నారు. తర్వాత నామినేషన్స్‌లో వున్న వారిని సేవ్ చేసే ప్రాసెస్ మొదలుపెట్టాడు నాగ్. అయితే ప్రతీవారం ఆయన ఈ పనిచేసేవారు.. కానీ ఈసారి మాత్రం కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యుల చేత సేవ్ చేయించే ప్లాన్ చేశారు.

భోలే షావళి, అశ్విని శ్రీ, తేజ, ప్రశాంత్, పూజా, అమర్‌దీప్, గౌతమ్‌లు ఈ వారం నామినేషన్స్‌లో వున్నారు. చివరికి పూజా మూర్తి, భోలే షావళి మిగిలారు. దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఇంటి సభ్యులు, ప్రేక్షకుల్లో టెన్షన్ మొదలైంది. ఇద్దరి ముందు రెండు బాక్స్‌లు పెట్టి.. అందులో వారి చేతులు పెట్టాలి, బయటకు తీసినప్పుడు ఎవరి చేతికి రెడ్ కలర్ వుంటుందో వారు ఎలిమినేట్, గ్రీన్ వచ్చిన వాళ్లు సేవ్ అవుతారని నాగ్ తెలిపారు. పూజా చేతికి ఎరుపు రంగు అంటుకోవడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. అనంతరం ఇంటి సభ్యులు ఆమెకు సెండాఫ్ ఇచ్చారు. తర్వాత వేదికపైకి వచ్చిన పూజా మూర్తితో ఇంటి సభ్యుల గురించి తన అభిప్రాయం చెప్పాల్సిందిగా నాగార్జున కోరారు. కానీ ఆమె ఎవ్వరి గురించి నెగిటివ్‌గా చెప్పకుండా , ప్రతి ఒక్కరి గురించి పాజిటివ్‌గానే చెప్పింది.

తర్వాత.. గతంలో ఎలిమినేట్ అయిన దామిని, శుభశ్రీ, రతికల్లో ఒకరు రీ ఎంట్రీ ఇస్తారని, అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన వారికి ఛాన్స్ ఇస్తామని నాగార్జున తెలిపారు. అలా శుభశ్రీ, దామినిల కంటే తక్కువ ఓట్లు వచ్చిన రతిక బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుందని ఆయన ప్రకటించారు. సెకండ్ ఛాన్స్‌ని తాను ఉపయోగించుకుని బాగా ఆడతానని రతిక స్టేజ్‌పై నాగ్‌తో చెప్పింది.