`రాధేశ్యామ్` నుండి తిరిగొచ్చేసిన పూజాహెగ్డే..

  • IndiaGlitz, [Tuesday,November 03 2020]

'రాధేశ్యామ్' నుండి పూజా హెగ్డే తిరిగొచ్చేసిందా! అంటే అవును నిజ‌మే అనాలి. ఎందుంక‌టే ఆ సినిమాలో పూజాహెగ్డే త‌న పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకోవ‌డంతో త‌దుప‌రి సినిమా కోసం పూజా ఇండియా తిరిగొచ్చేసింది. 'డీజే దువ్వాడజగన్నాథమ్‌, మహర్షి, అరవిందసమేత, గద్దలకొండ గణేష్‌' చిత్రాల సక్సెస్‌తో పాటు ఈ ఏడాది విడుదలైన బ్లాక్‌బస్టర్‌ మూవీ 'అల వైకుంఠపురములో..' చిత్రంలోనూ నటించి స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే. ఇప్పుడు ప్రభాస్‌ 20వ చిత్రం 'రాధేశ్యామ్‌'లోనూ హీరోయిన్‌గా నటిస్తోన్న‌ సంగ‌తి తెలిసిందే. మరో వైపు అఖిల్‌ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ చేస్తున్న 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్'‌తోనూ ఈ అమ్మ‌డు జ‌త‌క‌ట్టింది. ఇటీవ‌ల 'రాధేశ్యామ్' షెడ్యూల్ కోసం ఇట‌లీ వెళ్లిన పూజాహెగ్డే అక్క‌డ త‌న పాత్ర‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంద‌ట‌. వెంట‌నే త‌ను చేయ‌బోయే బాలీవుడ్ చిత్రం కోసం ముంబై చేరుకుందీ అమ్మ‌డు.

ప్రస్తుతం పూజా హెగ్డే చేస్తున్న ప్రభాస్‌, అఖిల్‌ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తుంది. ప్రభాస్‌ చిత్రం పీరియాడికల్‌ చిత్రం. ఇందులో పూజ మ్యూజిక్ టీచర్‌ పాత్రలో నటిస్తుందని అంటున్నారు. కాగా.. అఖిల్‌ చిత్రంలో స్టాండప్‌ కమెడియన్‌ పాత్రలో కనిపిస్తుంద‌ని వార్తలు వినిపిస్తున్నాయి. 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్' సంక్రాంతికి విడుదలవుతుంటే... 'రాధేశ్యామ్'‌ వేసవిలో విడుదల కానుంది.