తెలుగు రాష్ట్రాల్లో ఈ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

  • IndiaGlitz, [Monday,May 13 2024]

తెలంగాణలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని మావోయిస్ట్ ప్రభావిత 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఇందులో ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, మంచిర్యాల, పినపాక, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలు ఉన్నాయి. ఇక మిగిలిన 106 నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

మరోవైపు ఏపీలో కూడా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. పాడేరు, అరకు, రంపచోడవరంలో ఎన్నికల పోలింగ్‌ను అధికారులు ముగించారు. సాయంత్రం 4 గంటల లోపు క్యూలైన్లలో నిలుచున్న ఓట్లరకు ఓటేసేందుకు అవకాశం కల్పించారు. ఇక సమస్యాత్మక నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో కూడా 5 గంటలకు పోలింగ్ ముసిగింది. మిగిలిన 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

అటు ఏపీలో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, వృద్ధులు ఓటు వేసేందుకు క్యూ కట్టారు. రూరల్ ఏరియాలతో పాటు అర్బన్ ఏరియాల్లోనూ ఓటింగ్ శాతం పెరుగుతుండంటం శుభ పరిణామంగా అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం 4 గంటల వరకు 60శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. దీంతో పోలింగ్ సమయం ముగిసే నాటికి 80శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పెరిగిన పోలింగ్ శాతం ఏ పార్టీకి విజయం అందిస్తుందో జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.