Vande Bharat: ఏపీలో రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

  • IndiaGlitz, [Tuesday,March 12 2024]

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కేంద్ర రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య మరో వందేభారత్ రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించగా.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోని ప్లాట్ ఫామ్ నెంబర్ 10పై వందేభారత్ రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పచ్చ జెండా ఊపారు. ఈనెల 14 నుంచి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. గురువారం తప్పితే వారానికి ఆరు రోజుల పాటు రెండు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. మొత్తం 530 మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణించవచ్చు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న మూడో వందేభారత్ రైలు కావడం విశేషం. సికింద్రాబాద్ - వైజాగ్ మధ్య రెండో రైలు కాగా... మరొకటి సికింద్రాబాద్- తిరుపతి మధ్య తిరుగుతోంది. ఇక పూరీ నుంచి విశాఖపట్నం రైలుతో సహా మొత్తం 10 కొత్త హైస్పీడ్ వందే భారత్ రైళ్లను మోదీ ప్రారంభించారు. ఇందులో ఢిల్లీ-కత్రా, ఢిల్లీ-వారణాసి, ముంబై-అహ్మదాబాద్, మైసూర్-చెన్నై, కాసర్గోడ్-తిరువనంతపురం, పాట్నా- లక్నో, న్యూ జల్పాయిగురి-పాట్నా, లక్నో-డెహ్రాడూన్ ఉన్నాయి. వీటితో కలిపి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు 51 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్ల సేవలు మొత్తం 24 రాష్ట్రాలు.. 256 జిల్లాల్లో విస్తరించాయి.

ఈ సందర్భంగా మోదీ కాంగ్రెస్ పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్రానంతరం వచ్చిన ప్రభుత్వాలు రాజకీయ స్వార్థానికి ప్రాధాన్యం ఇచ్చాయే కానీ దేశాభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. ఇందుకు భారతీయ రైల్వే వ్యవస్థే ఉదాహరణగా చెప్పుకోవచ్చని తెలిపారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే వ్యవస్థ రూపురేఖలు మారుస్తున్నామని పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్‌లో చేర్చడం వల్ల ప్రభుత్వ నిధులు రైల్వే అభివృద్ధికి వినియోగిస్తున్నామని వెల్లడించారు.