Atal Setu: దేశంలోనే అతి పెద్ద వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ

  • IndiaGlitz, [Friday,January 12 2024]

ముంబయిలో దేశంలోనే అతి పెద్ద వంతెన 'అటల్ బిహారి వాజ్‌పేయి సెవ్రి- న్వశేవ అటల్ సేతు'ను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రారంభించారు. ముంబయి ట్రాన్స్‌ హార్బర్ లింగ్(MTHL)ను జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాధ్ షిండేతో పాటు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పాల్గొన్నారు. ముంబయిలోని సెవ్రీ నుంచి రాయ్‌గడ్ జిల్లాలోని నవా వేవాను కలుపుతూ 21.8 కిలోమీటర్లు పాటు ఆరు వరుసల్లో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. దాదాపు రూ.17,840కోట్లతో ఈ వంతెనను నిర్మించడం విశేషం. ఇది ప్రజలకు అందుబాటులోకి రావడంతో ముంబై-నవీ ముంబైకి మధ్య ప్రయాణం చాలా తగ్గింది. గతంలో గంటకు పైగా పట్టే ఈ ప్రయాణం..ప్రస్తుతం 15 నిమిషాలే పట్టనుంది. 2016లో ఈ వంతెనకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

అటల్ సేతు వంతెన ప్రత్యేకతలు..

దేశంలోనే 21 కిలోమీటర్ల మేర నిర్మించిన ఇతి పెద్ద సముద్ర వంతెన.

ఈ వంతెన ద్వారా ముంబై నుండి నవీ ముంబై చేరుకోవడానికి కేవలం 15-20 నిమిషాలే పడుతుంది.

ఈ వంతెన దక్షిణ ముంబైలోని సెవ్రి నుండి ప్రారంభమై.. ఎలిఫెట్ ఐలాండ్‌కు ఉత్తరాన థానే క్రీక్‌ను దాటి న్హావా సమీపంలోని చిర్లే గ్రామంలో ముగుస్తుంది.

దీని ద్వారా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నవీ ముంబై అంతర్జాతీయ విమానాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీ ఉంటుంది.

ముంబై ట్రాన్స్ హార్బర్ లింగ్ ద్వారా నాలుగు చక్రాల వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించే వీలుంది.

మోటార్ బైక్‌లు, ఆటో రిక్షాలు, ట్రాక్టర్లను ఈ బ్రిడ్జిపైకి అనుమతించరు.

ప్రాజెక్టు కారణంగా ఆవాసం కోల్పోయిన మత్స్యకారులకు ప్రభుత్వం పరిహారం అందిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ వంతెన ప్రారంభోత్సవంతో పాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలను ప్రధాని మోదీ చేశారు. అలాగే జాతీయ యువజన దినోత్సవంలో భాగంగా నాసిక్‌లోని తపోవన్ గ్రౌండ్‌లో రాష్ట్రీయ యువ మహోత్సవ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ముందు రెండు గంటల పాటు రోడ్ షో నిర్వహించారు. ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజలు, బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. కాగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు నుంచి 16వ తేదీ వరకూ ఏటా జాతీయ యువజన ఉత్సవాలను దేశమంతటా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మహారాష్ట్రలో చేపట్టారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ వివేకానంద జయంతి భారతదేశంలోని యువశక్తిని చాటే రోజని, బానిసత్యం రోజుల్లో దేశానికి కొత్త శక్తిని నింపిన స్వామి వివేకానందకు ఈరోజు అంకితమన్నారు.