PM Modi:బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాం: ప్రధాని మోదీ

  • IndiaGlitz, [Tuesday,November 07 2023]

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో మోదీతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఎల్బీ స్టేడియంతో తనకు అనుబంధం ఉందని పదేళ్ల క్రితం ఈ స్టేడియంలో ప్రజలు ఆశీర్వదించడంతో తాను ప్రధాని అయిన విషయాన్ని గుర్తుచేశారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేక ప్రభుత్వం ఉందని.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అవి నెరవేరలేదన్నారు.

లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్‌ నేతలకు సంబంధం..

బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆకాంక్షలను పట్టించుకోని వారిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారన్నారు. దివంగత నేత అబ్దుల్ కలాంను, ద్రౌపది ముర్ములను రాష్ట్రపతిని చేసిస ఘనత తమదే అన్నారు. లోక్ సభలో తొలి దళిత స్పీకర్ బాలయోగిని చేసింది కూడా నాటి ఎన్డీఏ ప్రభుత్వమేనని మోదీ వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏలో మూడు అంశాలు కామన్‌గా ఉన్నాయని.. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు ఆ రెండు పార్టీల లక్షణాలు అని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి సీ టీమ్ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుతో సంబంధాలు ఉన్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతిపరులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని మోదీ హెచ్చరించారు.

ఔర్ ఏక్ బార్ మోదీజీ..

సకల జనులు సమరం చేస్తేనే తెలంగాణ వచ్చిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గుర్తుచేశారు. సామాజిక తెలంగాణ... బీసీ తెలంగాణకు తాను పూర్తిగా మద్దతిస్తున్నానన్నారు. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రధాని మోదీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకొని ఉంటే ఆర్టికల్‌ 370ని రద్దు చేసేవారు కాదని.. అలాగే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునేవారు కాదన్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయన్నారు. తనలాంటి కోట్ల మంది కన్న కలలకు ప్రతిరూపమే మోదీ అని పవన్‌ వ్యాఖ్యానించారు. మూడోసారి కూడా మోదీ ప్రధాని అవుతారని.. ఔర్ ఏక్ బార్ మోదీ అంటూ నినదించారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్‌, మజ్లిస్‌ ఒక్కటే..

ఇక తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్‌, మజ్లిస్‌ ఒక్కటేనని ఆరోపించారు. మన్మోహన్‌ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కేసీఆర్‌ కేంద్ర మంత్రిగా ఉన్నారని, టీఆర్ఎస్ నేతలు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ అమ్ముడుపోయే పార్టీ అని, బీఆర్ఎస్ కొనుగోలు చేసే పార్టీ అని విమర్శించారు. ఈ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కేటనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.