Supritha:ప్లీజ్ నన్ను వదిలేయండి.. మీకేం అన్యాయం చేశాను: సుప్రీత

  • IndiaGlitz, [Tuesday,December 05 2023]

తెలుగు నటి సురేఖావాణి పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇటీవల సినిమా అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తన కూతురిని కూడా సినిమాల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కూతురు సుప్రీతతో కలిసి రీల్స్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. దీంతో ఆ వీడియోలు వైరల్ కావడంతో.. ఇంత వయసుచ్చినా కన్న కూతురితో కలిసి ఇలాంటి వీడియోలు ఏంటని విపరీతమైన ట్రోల్స్‌ ఎదుర్కొన్నారు. అలాగే ఈ మధ్య కాలంలో ఓ డ్రగ్స్ కేసులోనూ సురేఖావాణి పేరు ప్రధానం వినిపించింది. దాంతో ఆ కేసులకు తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.

ఇక ఆ ఘటన తర్వాత కూడా ఇంతకుముందు లాగే కూతురితో కలిసి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటి వల్ల ఒక్కోసారి విపరీతమైన ట్రోల్స్‌కు గురై ఇబ్బంది పడ్డారు. అయితే ఇటీవల తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముందు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా రీల్స్ చేసి తమ ఖాతాల్లో పోస్ట్ చేశారు. కానీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో వారు ఆ రీల్స్ తొలగించారు. తాజాగా సుప్రీత టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఇక అంతే నెటిజన్లు రెచ్చిపోయి మరీ ట్రోల్స్ చేస్తున్నారు. అప్పుడేమో గులాబీ రాములమ్మ అంటూ రీల్స్ పెట్టి.. ఇప్పుడు కాంగ్రెస్ గెలవగానే రేవంత్‌కు మద్దతుగా పోస్ట్ పెడతావా.. మీకు అసలు క్యారెక్టర్ ఉందా అంటూ బూతులతో అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ట్రోల్స్‌పై సుప్రీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నన్ను ట్యాగ్ చేసి మరీ వేధిస్తున్నారు. నేను తొలుత బీఆర్ఎస్‌కు సపోర్టు చేశా. అందులో తప్పు ఏముంది. అలాగే ఇన్‌స్టా స్టోరీలో కొత్త సీఎంకు శుభాకాంక్షలు చెప్పా. ఇంత మాత్రానికే నన్ను ట్రోల్ చేయడం చాలా బాధగా ఉంది. నేను మీకేం అన్యాయం చేశా? నాపై ఎందుకింత ద్వేషం? మీ ట్రోలింగ్ నా మానసిక ఆరోగ్యంపై ఎంతటి ప్రభావం చూపిస్తోందో తెలుసా? అంటూ అందులో పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా ఎన్నికలకు ముందు చాలా మంది సీరియల్ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూన్సర్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఇలా చాలా మంది బీఆర్‌ఎస్‌కు మద్దతుగా గులాబీల రాముల్మ్మ పాటకు డ్యాన్స్ వేస్తూ రీల్స్ చేశారు. ఇందులో శివజ్యోతి, లాస్య, అషూ రెడ్డి, సుప్రీతతో పాటు పలువురు ఉన్నారు. అయితే ఇవి పెయిడ్ ప్రమోషన్స్‌ అయి ఉండవచ్చు లేదా స్వచ్ఛందంగా సపోర్ట్ చేసి ఉండవచ్చు. కానీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో గులాబీ పార్టీకి మద్దతుగా వీడియోలు చేసిన వారందరినీ విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఒక్క రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన తమను ఇంతలా వేధించడం కరెక్ట్ కాదని వాపోతున్నారు. దయచేసి అయిపోయింది ఏదో ఇకనైనా ట్రోల్స్ ఆపండి అంటూ నెటిజన్లకు విజ్ఞప్తిచేస్తున్నారు.