పవన్ ముఖ్యమంత్రి అయి తీరుతారు..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్లో జనసేన, బీఎస్పీ, సిపిఐ, సిపిఎంల కూటమి మెజార్టీ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి విశ్వాసం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పవన్ ఏపీకి యువ ముఖ్యమంత్రి అయి తీరుతారని చెప్పారు.
గురువారం సాయంత్రం తిరుపతి వేదికగా జరిగిన బహుజన జనసేన యుధ్దభేరి సభలో మాయావతి మాట్లాడుతూ.. "యూపీని నాలుగు దఫాల్లో మేం ఎలా అయితే అభివృద్దిపరిచామో అదే స్థాయిలో పవన్కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తారన్న నమ్మకం ఉంది. నిబద్దతతో పని చేసే ఆయన ప్రజల అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గం చూపుతారన్న భరోసా ఉంది. బీఎస్పీ, జనసేన, వామపక్షాల కూటమిని చంద్రబాబుతో కలిపి మాట్లాడుతున్నారు. బీఎస్పీ, జనసేన, సిపిఐ, సిపిఎం మినహా మా కూటమికి మరే ఇతర పార్టీతో సంబంధం లేదు. ప్రత్యేక హోదా పేరు చెప్పి బీజేపీ-టీడీపీలు ఆంధ్ర ప్రజల్ని మోసం చేశాయి. ఏపీలో విపక్ష పార్టీ అదే బీజేపీకి కొమ్ము కాస్తోంది. దళిత, బలహీన వర్గాలకు జనసేన కూటమి మాత్రమే న్యాయం చేయగలదు. మా కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ సర్వీసెస్లో కోటా పెంచుతాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సముచిత స్థానం కల్పిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అభివృద్దిలో ఏపీకి సముచిత స్థానం కల్పిస్తాం. చిత్తూరు, తిరుపతి పార్లమెంటు స్థానాలతోపాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్ధులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఐదేళ్ల క్రితం ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. అందులో ఒక్కటీ నెరవేర్చలేదు. ఇప్పుడు మరో వాగ్దాన పత్రం బీజేపీ సిద్ధం చేసింది. ఆ మేనిఫెస్టోలతో మీ ముందుకు వచ్చే పార్టీలను ప్రశ్నించండి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతి ఏంటని. బీఎస్పీ ఎప్పుడూ మేనిఫెస్టోలు విడుదల చేయలేదు. కేవలం ప్రజలకు ఏం కావాలో అది మాత్రమే చేశాం. గత ఎన్నికల్లో అనేక మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏ వర్గానికి న్యాయం చేయలేకపోయింది" అని మాయావతి విమర్శలు గుప్పించారు.
ఇక నాటకాలు సాగవ్...
"చౌకీదార్ అంటూ వాళ్ళు ఆడుతున్న నాటకాలు ఇక సాగవు. ఇప్పుడు మోడీ చేస్తున్న దొంగ ప్రమాణాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మోడీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులుపడ్డారు. దేశ ప్రజల్ని మోసం చేస్తూ, మభ్యపెడుతున్న మోడీకి ప్రజలు గట్టిగా బుద్ది చెబుతారు. ఆర్.ఎస్.ఎస్ ముసుగులో దేశంలో మత విద్వేషాలు సృష్టిస్తున్నారు. ఆర్.ఎస్.ఎస్. అజెండాను అమలుచేస్తున్నారు. దేశభక్తి అనే అంశాన్ని అడ్డుపెట్టుకుని మోడీ తమ తప్పిదాలు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్-బీజేపీల పాలన దేశాభివృద్దిని వెనక్కి నెట్టింది. గతంలో కాంగ్రెస్ పార్టీ మాదిరే రైతులు, దళితులు, మైనారిటీల సమస్యల్ని నిర్లక్ష్యం చేసింది" అని మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయివేటు ఉద్యోగాల్లోనూ దళితులకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాలను మోసం చేసిన బీజేపీని ఈసారి దేశ ప్రజలు తిరస్కరిస్తారు. కాంగ్రెస్,బీజేపీ ప్రజలు విశ్వాసం కోల్పోయాయి. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడానికి వీల్లేదు. బీజేపీకి దేశ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. మా కూటమితోనే సామాజిక న్యాయం సిద్ధిస్తుంది. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహనీయులు పూలే, నారాయణగురు, అంబేద్కర్, శ్రీ కాన్షీరాం గార్లు కన్న కలలను సాకారం చేస్తాం"అని మాయావతి హామీ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments