పసుపులేటి లేరన్న వార్త బాధ కలిగించింది!

  • IndiaGlitz, [Tuesday,February 11 2020]

సీనియర్ సినిమా జర్నలిస్ట్ జర్నలిస్టు పసుపులేటి రామారావు కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పసుపులేటి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించారని తెలుసుకున్న పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. తాజాగా.. పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ‘సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ శ్రీ పసుపులేటి రామారావు గారు కన్నుమూశారనే వార్త నన్ను బాధకు గురి చేసింది. వ్యక్తిగతంగా వారితో నాచిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. వామపక్ష భావాలు కలిగిన శ్రీ రామారావు గారు మృదు స్వభావి. తెలుగు సినిమాపై పలు రచనలు చేసి సినీ చరిత్రకు అక్షర రూపమీయడంలో తన వంతు పాత్రను పోషించారు. శ్రీ రామారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ ఓ ప్రకటనలో పవన్ పేర్కొన్నారు.

కాగా.. మెగా బ్రదర్స్ ముగ్గురూ.. చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ పేర్లు కలిసేలా.. పసుపులేటి తన కుమారుడికి ‘కళ్యాణ్ నాగ చిరంజీవి’ అని పెట్టారు. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని చిరు ఓ ప్రకటన విడుదల చేశారు. స్వయంగా పసుపులేటి ఇంటికెళ్లిన చిరు.. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు.