జగన్ను ఎలా నమ్మాలి.. అలీని వైసీపీలోకి ఎందుకు తీసున్నావ్!?
- IndiaGlitz, [Thursday,April 04 2019]
వైఎస్ఆర్సీపీ నాయకులకు జనసేన పార్టీ అంటే అసూయ అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. మాజీ జేడీ లక్ష్మీనారాయణ లాంటి నిజాయతీపరులను పార్టీలోకి తీసుకొచ్చామని వైసీపీకి మనమంటే కోపమన్నారు. గురువారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బహిరంగసభ నిర్వహించిన పవన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ2 ముద్దాయి విజయసాయి రెడ్డిని మీ వెంటే ఎందుకు తిప్పుతున్నారని మేము ఏరోజైనా ప్రశ్నించామా..?. మరి మీరెందుకు మాజీ జేడీ పార్టీలోకి వస్తే విషం చిమ్ముతున్నారు.?. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి నన్ను యాక్టర్, పార్టనర్ అంటారు.. మీ పార్టీకి యాక్టర్స్ అవసరం లేనప్పుడు అలీని ఎందుకు తీసుకున్నారు..?. నిజమే నేను పార్టనర్నే అవినీతిపై పోరాటం చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టనర్ని. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిలా అవినీతి చేసి జైల్లో కూర్చున్న పార్టనర్స్ కాదు. ఈ నెల 9వ తేదీన నన్ను ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి విశాఖ, గాజువాకలో పర్యటిస్తారంట. ఆయనకు ఒకటే చెబుతున్నాను. పవన్ కళ్యాణ్ మీద పెట్టిన దృష్టి అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై పెట్టి ఉంటే సగానికి పైగా సమస్యలు ఎప్పుడో కనుమరుగైపోయేవి అని పవన్ చెప్పుకొచ్చారు.
దళితుల పరిస్థితి చూడు...
జగన్మోహన్ రెడ్డికి దళితులంటే విపరీతమైన ప్రేమ అంటారు కదా..? ఒక్క సారి రాయలసీమకు వెళ్లి చూడండి. దళితులను ఎలా ట్రీట్ చేస్తారో. వైసీపీ నాయకుల ఇళ్ల ముందు నుంచి వెళ్లాలంటే చెప్పులు చేతులతో పట్టుకొని వెళ్లాలంట. వీళ్లా దళితులు గురించి, మానవత్వం గురించి మాట్లాడేది. అవినీతి కేసుల్లో ఇరుక్కొని రెండేళ్లు జైల్లో కూర్చొని వచ్చి అవినీతిని అంతం చేస్తామంటే మేము నమ్మాలి. జగన్మోహన్ రెడ్డికి మోడీ, అమిత్ షా లంటే భయం. ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించలేడు. జగన్మోహన్ రెడ్డి కోరుకునేది నేనే బాగుండాలి మిగతా వారు నా మీద ఆధారపడి బతకాలని కోరుకుంటారు. నేను మాత్రం సర్వేజనాః సుఖినోభవంతు అని కోరుకుంటాను. పవన్ కళ్యాణ్ పక్కన జేడీలాంటి నిజాయతీపరుడైన ఉద్యోగి ఉంటే.. జగన్మోహన్ రెడ్డి పక్కన విజయసాయి రెడ్డిలాంటి అక్రమార్కులు, చంద్రబాబు పక్కన గంటాలాంటి దోపిడి, కబ్జాకోరులు ఉన్నారు అని పవన్ చెప్పుకొచ్చారు.
గంటాకు ఓటమే..!
2014కి 2019కి తేడా ఏంటో ఈపాటికే తెలిసి ఉంటుంది. పల్లకీలు మోసిన మమ్మల్ని పుల్లల్లా తీసి పక్కనపడేశారు. పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి కాదు. ఒక వ్యవస్థ. దానిని దాటుకొని మీరు ఎలా గెలుస్తారో మేము చూస్తాం. మార్పు వచ్చేటప్పుడు ఎవ్వరికి తెలియదు. చాలా సైలెంటుగా వస్తుంది. జనసేన రూపంలో అది ఈ రోజు బయటకు వస్తుంది. విశాఖ ఎంపీగా జేడీ లక్ష్మీనారాయణ గెలవడం ఖాయం. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా ఓడిపోవడం జనసేన అభ్యర్ధి ఉషాకిరణ్ గెలవడం ఖాయం. మార్పు కోసం జనసేనకే ఓటు వేయండి. గాజు గ్లాస్ గుర్తుపై నిలబడే అభ్యర్ధులను అఖండ మెజార్టీతో గెలిపించండి అని వవన్ కల్యాణ్ ఓటర్లను అభ్యర్థించారు.