వైఎస్ జగన్ స్థానంలో నేనుంటే.. పవన్
- IndiaGlitz, [Thursday,April 04 2019]
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానంలో తానుంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. గురువారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బహిరంగసభ నిర్వహించిన పవన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మీ ముందు (ప్రజల ముందు) మూడు పార్టీలు ఉన్నాయి.. సమస్యలు కూడా ఉన్నాయి. జగన్మోహన్రెడ్డి స్థానంలో నేను ఉంటే మీ తరఫున అసెంబ్లీలో మాట్లాడేవాడిని, రోడ్డు మీదకి ఎక్కి కొట్లాడే వాడిని. ఒక్కడినే అసెంబ్లీలో ఉన్నా ముఖ్యమంత్రి చైర్ వద్దకు వెళ్లి మరీ పరిష్కరించే వాడిని. ఆయన తీరు ఎలా ఉంది... ఏ సమస్య చెప్పినా నేను ముఖ్యమంత్రి అవ్వాలి అంటారు.
ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీకి ఓటు వేసిన జరిగేది అధికార బదలాయింపే. సమస్యలు మాత్రం ఎక్కడివి అక్కడే ఉంటాయి. ఈ తరహా రాజకీయాల్లో చెత్తను ఊడ్చేసేందుకే రెల్లి కులాన్ని స్వీకరించా. ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలంటే ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం ఉన్న వ్యక్తి జేడీ లక్ష్మీనారాయణ. ఆయన్ని విశాఖపట్నం లోక్ సభ స్థానానికి మన పార్టీ అభ్యర్థిగా నిలిపాం. పదేళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వేయండి అంటూ ఓటర్లకు పవన్ విజ్ఞప్తి చేశారు.