Pawan Kalyan:చంద్రబాబును కలిసిన పవన్ కల్యాణ్‌.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా..

  • IndiaGlitz, [Saturday,November 04 2023]

టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పరామర్శించారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లారు. ఆయన వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తి ఆరోగ్యంతో ప్రజల ముందుకు రావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు బెయిల్‌పై విడుదలైన సమయంలో వరుణ్ తేజ్ పెళ్లి కార్యక్రమం కోసం పవన్ ఇటలీలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఇటలీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు.

అక్టోబర్ 31న రాజమండ్రి జైలు నుంచి విడుదలైన చంద్రబాబు.. బుధవారం హైదరాబాద్‌కు వచ్చారు. గురువారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యుల సూచనల మేరకు ఒకరోజు ఆసుపత్రిలోనే ఉన్నారు. శుక్రవారం సాయంత్రి డిశ్చార్జి అయిన ఆయన.. నేడు ఎల్వీప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. వచ్చే మంగళవారం కంటికి సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం ఉందని సమాచారం.

స్కిల్ డెవల్‌ప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి జైలుకు వెళ్లగా.. వెంటనే జనసేనాని పవన్ కల్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణతో కలిసి బాబుతో ములాఖత్ అయ్యారు. ములాఖత్ అనంతరం బయటకు వచ్చిన పవన్.. టీడీపీతో పొత్తును అధికారికంగా ప్రకటించారు. పొత్తు ప్రకటన తర్వాత చంద్రబాబును పవన్ కల్యాణ్ కలవడం ఇదే మొదటి సారి. ఈ సమావేశంలో ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన క్యాడర్ కింది స్థాయి వరకూ కలిసి పనిచేసేలా కార్యాచరణ చేపట్టారు. సమన్వయ కమిటీ సమవేశాలు నిర్వహిస్తున్నారు.