Pawan Kalyan:మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్‌

  • IndiaGlitz, [Saturday,March 30 2024]

మరో ఎంపీ అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బాలశౌరిని ఖరారుచేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే జరుగుతోందని.. ఇందుకు సంబంధించి తుది కసరత్తు పూర్తయిన తరువాత అభ్యర్థిని ప్రకటిస్తామని పార్టీ వెల్లడించింది.

కాగా మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా వల్లభనేని బాలశౌరి ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2019 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాడు. అయితే వైసీపీ అధిష్టానంతో పొసగక కొద్దిరోజుల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేసి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో మరోసారి మచిలీపట్నం ఎంపీగా జనసేన పార్టీ నుంచి ఆయన పోటీలో దిగుతారని ప్రచారం జరిగింది. అయితే ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో ఆయన పేరు లేకపోవడం కొంత చర్చనీయాంశమైంది. ఆ స్థానానికి బాలశౌరి కాకుండా వంగవీటి రాధా పేరు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ బాలశౌరికే టికెన్ ఖారారుచేస్తూ జనసేనాని నిర్ణయం తీసుకున్నారు.

కాగా పొత్తులో భాగంగా జనసేనకు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లు దక్కాయి. కాకినాడ స్థానం నుంచి ఉదయ్ శ్రీనివాస్ పేరు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా బందర్ ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి పేరు కన్ఫామ్ చేశారు. దీంతో మొత్తం 25 ఎంపీ సీట్లకు కూటమి అభ్యర్థులను ప్రకటించనట్లైంది. టీడీపీ 17, బీజేపీ 6 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి. ఇదిలా ఉంటే నేటి నుంచి పిఠాపురం కేంద్రంగా పవన్ కల్యాణ్‌ తొలి విడత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఏప్రిల్ 12వరకు జనసేన అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో వారాహి వాహనం ద్వారా ప్రచారం చేయనున్నారు.