‘ఉప్పెన’ టీంకు పవన్ అభినందనలు..

  • IndiaGlitz, [Thursday,February 11 2021]

‘ఉప్పెన’... మన చుట్టూ ఉన్న జీవితాల్ని చూపించే చిత్రమని.. తొలి చిత్రంతోనే మంచి పాత్రలో నటించిన వైష్ణవ్ తేజ్ ప్రేక్షకుల మెప్పు పొందుతాడని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలిపారు. వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ నెల 12వ తేదీన చిత్రం విడుదల కానుంది. హీరో వైష్ణవ్ తేజ్, బుచ్చిబాబు, రవిశంకర్ నేడు పవన్‌ను కలిశారు. పవన్‌కి ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను, ప్రమోషనల్ కంటెంట్‌ను చూపించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. దర్శకుడు బుచ్చిబాబు సానాకు.. ఈ చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ వారికి అభినందనలు తెలిపారు.

మన జీవితాల్ని... అందులోని భావోద్వేగాల్ని... మన చుట్టూ ఉన్న పరిస్థితులను కథగా తెర మీదకు తీసుకువచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారన్నారు. ఆ కోవలోకి ‘ఉప్పెన’ చిత్రం చేరుతుందని పవన్ పేర్కొన్నారు. మన మట్టి పరిమళాన్ని అందించే ఇలాంటి చిత్రాలు ప్రతి ఒకరికీ నచ్చుతాయన్నారు. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందని చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఇంకా పవన్ మాట్లాడుతూ.. “వైష్ణవ్ తేజ్ హీరోగా తొలి చిత్రంలోనే చాలా మంచి పాత్రను ఎంచుకున్నాడు. మొదటి అడుగులోనే సవాల్‌తో కూడుకున్న పాత్ర తీసుకున్న వైష్ణవ్ తేజ్ తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతాడు. వైష్ణవ్ ‘జానీ’ చిత్రంలో బాల నటుడిగా... హీరో చిన్నప్పటి పాత్రను పోషించాడు. ఇప్పుడు హీరోగా ఎదిగాడు.

‘ఉప్పెన’లో వైష్ణవ్ చాలా ఆకట్టుకునేలా ఉన్నాడు. దర్శకుడిగా బుచ్చిబాబు సానా ఈ కథను ఎంతో సమర్థంగా తెరకెక్కించారు అని అర్థం అవుతోంది. మనకు పరిచయం ఉన్న జీవితాలను... అందులోని ఎమోషన్స్ ను... మన నేటివిటీనీ కళ్ల ముందుకు తీసుకువచ్చే చిత్రాలు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటాయి. వీటికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ‘రంగస్థలం’, ‘దంగల్’ ‘లాంటి చిత్రాల్లో ఉండే ఎమోషన్స్ ఎక్కువ కాలం మనకు గుర్తుండిపోతాయి. ‘ఉప్పెన’ కథలోని ఎమోషన్స్ కూడా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతాయి. మంచి కథను తెరకెక్కించిన దర్శకుడు బుచ్చి బాబుకీ, ఈ చిత్ర నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, నటులకు నా అభినందనలు. ‘ఉప్పెన‘ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని పవన్ తెలిపారు.