నంబర్లేంటి..? టీమిండియాలో అయోమయం వద్దు!

ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం ఐపీఎల్‌ ఫీవర్ పట్టుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్‌లో ఓ వైపు ఎన్నికల హడావుడి వ్యవహారం పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ అది కాస్త పక్కనెట్టేసి ఐపీఎల్.. ఐపీఎల్ అంటూ జనాలంతా టీవీలకే అతుక్కుపోతున్నారు. అయితే ఇది పూర్తవ్వగానే వరల్డ్ కప్ ఉండటంతో ఎవరెవరు ఎప్పుడు బ్యాటింగ్‌‌కు దిగుతారా..? అని క్రీడాభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఒకటి, రెండు, మూడు స్థానాలు ఓకే గానీ నాలుగో స్థానం ఎవరిది అనే విషయంపై ఇంత వరకూ క్లారిటీ రాలేదు. దీంతో క్రికెట్ అభిమానులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.

అయితే.. ఈ వ్యవహారంపై తాజాగా.. భారత మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ స్పందించారు. టీమ్‌‌లోని ఆటగాళ్లకు నంబర్లు కేటాయించడం ఏంటి.? ఏ ఆటగాడైనా.. జట్టు పరిస్థితులను బట్టి ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సూచన కూడా చేశారు. అంతటితో ఆగని ఆయన.. అవసరాలను దృష్టిలో పెట్టుకొని బ్యాటింగ్‌ స్థానాలను నిర్ణయించాలి అని తేల్చిచెప్పారు. అనవసరంగా నాలుగో బ్యాట్స్‌మెన్ ఎవరు..? ఐదో బ్యాట్స్‌మెన్ ఎవరు..? అని ఆలోచించి జట్టు ఆయోమయానికి గురికావొద్దు అని కపిల్ చెప్పుకొచ్చారు. నంబర్లు అనే వ్యవహారం పక్కనెట్టేసి అంతా కలిసి ఒక జట్టులాగా ఆడాలి అంతే తప్ప .. కానీ నంబర్ల గురించి మాట్లాడటం సబబు కాదన్నారు. అయితే నాలుగో బ్యాట్స్‌మెన్‌‌గా యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.