కథ మీది, కల మీది... ఆట నాది, కోటి మీది: ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై మరోసారి హోస్ట్‌గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ పేరుతో ప్రారంభం కానున్న షోలో తారక్ హోస్ట్‌గా కనిపించనున్నాడు. తొలిసారిగా తారక్.. బిగ్‌బాస్ సీజన్ 1తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. తొలిసారిగా బుల్లితెరపై అడుగుపెట్టినప్పటికీ అదరగొట్టేశాడు. హోస్ట్ అంటే ఇలాగే ఉండాలి అన్నట్టుగా ఓ ట్రెండ్ సెట్ చేశాడు. ఆ తరువాత మళ్లీ బుల్లితెరపై కనిపించలేదు. బిగ్‌బాస్ సీజన్ 4 కూడా పూర్తైంది. ప్రతి సీజన్ సమయంలోనూ ఎన్టీఆర్ హోస్ట్‌గా వస్తే బాగుండని ఆయన అభిమానులే కాదు.. బిగ్‌బాస్ ప్రేక్షకులంతా కోరుకున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం తిరిగిన టెలివిజన్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఇన్నాళ్లకు తిరిగి బుల్లితెర ప్రేక్షకుల కోరిక తీరబోతోంది.

ఇప్పటికే ఓ ప్రోమో ద్వారా షో గురించి వెల్లడించిన జెమిని టీవీ.. తాజాగా యంగ్‌ టైగర్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఈ షో గురించి తారక్ చెప్పిన తీరు ఆకట్టుకుంటోంది. ‘‘హాయ్ ఈ ఆట గురించి నాకంటే మీకే బాగా తెలుసు. ఈ సీటు కొంచెం హాటు కదా.. ఇక్కడ కూర్చున్న వాళ్లు మొదట టకటకా ఆన్సర్లు చెప్పేస్తారు. సరిగ్గా లక్ష దాటాక మొదలవుతుంది టెన్షన్. ఛాయిస్ మనకు తెలిసినా చెమటలు పడతాయి. మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది.. లైట్లు బ్రేక్ అవుతాయి. ఆన్సర్ ఆడియన్స్‌కు తెలుసేమోనని పోలింగ్ పెడతారు. వాడెవడో ఫ్రెండ్‌కి ఐన్‌స్టీన్ అమ్మ మొగుడనుకుని ఫోన్ కొడతారు. ఫైనల్‌గా నావైపు చూస్తారు. ఈడెవడో ఎదురుగా గంభీరంగా కూర్చొన్నాడు వీడికేమైనా తెలుసేమోనని.

ఎబ్బే.. మీరు కరెక్ట్‌గా చెబితే తెలుసుకుందామని నేను వెయిటింగ్. ఇక్కడి నుంచి మీరెంత పట్టుకెళతారో నేను చెప్పలేను. కానీ లైఫ్‌లో నేను గెలవగలుగుతాననే కాన్ఫిడెన్స్‌ను మాత్రం కచ్చితంగా పట్టుకెళతారు. నాది గ్యారంటీ. ఇక్కడ కథ మీది.. కల మీది. ఆట నాది.. కోటి మీది. రండి గెలుద్దాం. ఎవరు మీలో కోటీశ్వరుడు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.. సైనింగ్ ఆఫ్ మీ రామారావు’’ అంటూ తారక్ ప్రోమోలో వెల్లడించాడు. మొత్తానికి యంగ్ టైగర్ బుల్లితెరపై మరోసారి సందడి చేయబోతున్నాడు. షో సంగతేమో కానీ ఎన్టీఆర్ హోస్టింగ్ కోసమైనా చూసే ప్రేక్షకులు మాత్రం నూటికి నూరు శాతం ఉన్నారు. ఇప్పటికే బిగ్‌బాస్‌తో ఆయనొక ట్రెండ్ సెట్ చేసేశాడు. ఇప్పుడు ఈ షోని విజయ తీరాలకు నడిపించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు