బడ్జెట్‌లో ఉచిత విద్యుత్ పథకం ప్రకటించిన నిర్మలా సీతారామన్

  • IndiaGlitz, [Thursday,February 01 2024]

లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో పేద, మధ్యతరగతి ప్రజలకు కొన్ని శుభవార్తలు చెప్పారు. రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు. విద్యుత్ బిల్లుల నుంచి విముక్తికి కొత్తగా సోలార్ పథకం ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. దీనివల్ల గృహ వినియోగదారులకు ఏటా రూ. 15వేల నుంచి రూ.18 వేల వరకు ఆదా అవుతుందని చెప్పుకొచ్చారు.

మరోవైపు సొంత ఇళ్లులేని పేద, మధ్యతరగతికి చెందిన వారి కోసం వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్లనున్నట్లు పేర్కొన్నారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉంటున్న వారి సొంతింటి కలను సాకారం చేస్తామని తెలిపారు. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకోనున్నామని.. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాబోయే ఐదేళ్లూ ఈ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించామన్నారు.

ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా కొత్త ట్యాక్స్ విధానాన్ని నిర్మలమ్మ ప్రవేశపెట్టారు. కొత్త ట్యాక్స్ విధానంలో రూ.7లక్షల వరకూ ఎలాంటి పన్ను లేదని తేల్చి చెప్పారు. పన్నుల శ్లాబులు యథాతథంగా ఉంటాయని వెల్లడించారు.. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టంచేశారు. అలాగే కార్పొరేట్ ట్యాక్స్‌ని 30% నుంచి 22%కి తగ్గించామని వివరించారు.

ఇక ఆశా కార్యకర్తలకు, అంగన్‌వాడీలకూ గుడ్‌న్యూస్ చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో వీళ్లనూ అర్హులుగా చేరుస్తామని ప్రకటించారు. ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్‌ను 2021 సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.