50 రోజులు పూర్తి చేసుకున్న నేనూ సీతాదేవి..!

  • IndiaGlitz, [Friday,December 02 2016]

హ‌ర్ర‌ర్ కామెడీ చిత్రాల ట్రెండ్ కొన‌సాగిస్తూ...మ‌రో చిత్రం విజ‌యాన్ని అందుకుంది. యువ క‌థానాయ‌కుడు సందీప్ ను తెర‌కు ప‌రిచ‌యం చేస్తూ రూపొందిన చిత్రం నేనూ సీతాదేవి. ఈ చిత్రం ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో 50 రోజులు పూర్తి చేసుకుంది. సందీప్ క్రియేష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్నినిర్మించింది. వినోదాత్మ‌క ప్రేమ‌క‌థ‌కు థ్రిల్ల‌ర్ అంశాలు తోడ‌వ‌డంతో నేనూ సీతాదేవి ఆక‌ట్టుకుంది. కొత్త సంగీత ద‌ర్శ‌కుడు చైత‌న్య అందించిన స్వ‌రాలు సినిమాకు బ‌లంగా మారాయి. కోమ‌లి, భవ్య‌శ్రీ హీరోయిన్స్ గా న‌టించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస్ మ‌ల్లం తెర‌కెక్కించారు. ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో ర‌ణ‌ధీర్, వెన్నెల కిషోర్, జీవా, ధ‌న‌రాజ్, గుండు హ‌నుమంత‌రావు, చిత్రం శీను త‌దిత‌రులు న‌టించారు.
ఈ సినిమా విజ‌యం పై చిత్ర క‌థానాయ‌కుడు, నిర్మాత సందీప్ మాట్లాడుతూ...నేను క‌థానాయ‌కుడిగా న‌టించిన తొలి చిత్రం విజ‌యం సాధించ‌డం సంతోషంగా ఉంది. మ‌రిన్ని చిత్రాల్లో నటించేందుకు ఈ స‌క్సెస్ ప్రొత్సాహాన్నిచ్చింది. హ‌ర్ర‌ర్, కామెడీ సుర‌క్షిత‌మైన జోన‌ర్ గా భావించి అలాంటి క‌థ‌తోనే ఈ చిత్రాన్ని రూపొందించాం. మా న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. యూనిట్ అంతా కొత్త‌వాళ్లే కావ‌డంతో సినిమాలో నూత‌న‌త్వం క‌నిపించింది. సినిమా చూసిన వాళ్ళు అదే అనుభూతికి లోన‌య్యారు. కోమ‌లి, భవ్య‌శ్రీల న‌ట‌న‌తో పాటు వెన్నెల కిషోర్, జీవా పాత్ర‌లు సినిమాను నిల‌బెట్టాయి. చిన్న చిత్రాల‌కు థియేట‌ర్స్ దొర‌క‌ని ప‌రిస్థితుల్లో వంద థియేట‌ర్స్ లో మా చిత్రాన్ని రిలీజ్ చేసాం. త‌క్కువ మొత్తాల‌కే ఈ చిత్రాన్ని కొన్న డిస్ట్రిబ్యూట‌ర్స్ సంతృప్తిగా ఉన్నారు. ప్ర‌స్తుతం మరో నిర్మాణ సంస్థ‌లో కొత్త సినిమాకు స‌న్నాహాలు జరుగుతున్నాయి అన్నారు.