శివసేనకు అజిత్ పవార్ చెక్ ... ఫడ్నవీస్ దే మహాపీఠం

  • IndiaGlitz, [Saturday,November 23 2019]

మహారాష్ట్ర రాజకీయాల్లో నెలరోజులుగా చెలరేగిన దుమారం హై డ్రామాల మధ్య ముగిసింది. ప్రభుత్వ ఏర్పాటు పై అటు బీజేపీ ఇటు శివసేనల మధ్య జరిగిన రాజకీయ చదరంగంలో చివరికి బీజేపీ నెగ్గింది. ఎన్సీపీ పొత్తుతో శివసేనకు చెక్ పెట్టి .. మహా పీఠాన్ని కైవసం చేసుకుంది. మహా పొలిటికల్ గేమ్ లో సీఎం పీఠం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అధిష్టించడం ఖాయం అని .. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. కానీ ప్రకటించి కొన్ని గంటలు కూడా గడవక ముందే... రాత్రికి రాత్రే సమీకరణాలు మారాయ్. శివసేన, కాంగ్రెస్ లకు హ్యాండ్ ఇస్తూ ఎన్సీపీ కమలానికి జైకొట్టింది. దీంతో తెల్లారేసరికి మహా సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ముఖ్యమంత్రి అయిపోవడం.. బీజేపీకి మద్ధతిచ్చిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం టకటకా జరిగిపోయాయ్. ఈ పరిణామాలతొ ఖంగుతిన్న శివసేన, కాంగ్రెస్ లు.. ఎన్సీపీ, బీజేపీలపై దుమ్మెత్తి పోస్తున్నాయి.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధానమంత్రి మోడీతో భేటీ అయినప్పటి నుంచి ఇలాంటిదేదో జరుగుతుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇన్నాళ్లు చర్చల పేరుతో కాలయాపన చేసిన శరద్ పవార్... ఎన్సీపీ ఎమ్మెల్యేలు శివసేనకు మద్ధతు ఇవ్వకపోవడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే మహా ప్రభుత్వ ఏర్పాటు అనంతరం శరద్ పవార్ చేసిన ట్వీట్ .. మరో మహా ట్విస్ట్ ఇచ్చింది. అజిత్ పవార్ బీజేపీకి మద్ధతు ఇస్తాడని అనుకోలేదని... అది తన వ్యక్తిగత నిర్ణయం అన్నారు. బీజేపీకి మద్దతివ్వడం తన నిర్ణయం కాదని.. అజిత్ పవార్ నిర్ణయాన్ని తాము స్వాగతించడం లేదన్నారు.

మరో వైపు రాష్ట్రపతి పదవి కోసమే శరద్ పవార్ ఇలా చేశారని ఆరోపిస్తున్నారు కొందరు శివసేన, కాంగ్రెస్ నేతలు. అజిత్ పవార్ తమకు వెన్నుపోటు పొడిచాడని శివసేన మండిపడుతుంటే.... డబుల్ గేమ్ ఆడుతుందని కాంగ్రెస్ విమర్శలకు దిగింది. అయితే అజిత్ పవార్ పై ముందునుండే అనుమానంగా ఉందని... అజిత్ నిర్ణయంతో శరద్ పవార్ కు సంబంధం లేదని భావిస్తున్నామని చెబుతోంది శివసేన. కానీ ఛత్రపతి శివాజీ వారసత్వమున్న మహారాష్ట్రలో ఇలాంటి రాజకీయాలు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు కోసమే బీజేపీతో చేతులు కలిపినట్లు వెల్లడించారు శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్. భారీ నష్టాలతో తల్లడిల్లుతున్న రైతులకు న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.