Chandrababu: చంద్రబాబుతో ముగిసిన లోకేశ్, భువనేశ్వరి ములాఖత్.. బాబు ఆరోగ్యం పట్ల భావోద్వేగం

  • IndiaGlitz, [Saturday,October 14 2023]

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో ఆయన కుటుంబసభ్యులు నారా లోకేష్, భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు. జైలులో బాబును చూసి భువనేశ్వరి, లోకేష్ తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే లోకేష్, భువనేశ్వరి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎప్పుడు ములాఖత్ అయిన మీడియాతో మాట్లాడే లోకేష్.. ఈసారి మాత్రం మాట్లాడకుండా వెళ్లారు. మానసికంగా చంద్రబాబు స్ట్రాంగ్‌గా ఉన్నా.. ఆరోగ్య సమస్యలపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

బాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.. మాట్లాడలేకపోతున్నారు..

అక్టోబర్ 6 తేదీ నుంచి ములాఖత్‌లో ఆరోగ్యంగా కనిపించిన చంద్రబాబు.. ఇవాళ చాలా వీక్‌గా కనిపించడంపై కుటుంబ సభ్యులు బాధపడుతున్నారని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోకేశ్‌తో పాటు చంద్రబాబుతో ములాఖత్ అయిన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వాపోయారు. ప్రస్తుతం చంద్రబాబు సరిగా మాట్లాడలేకపోతున్నట్లు చెప్పారు. జైల్లో ఆయన పరిస్థితి చూడగానే బాధ కలిగిందన్నారు.

చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నివేదిక..

మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంపై రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నివేదిక బయటకు వచ్చింది. చంద్రబాబు చేతులు, మొహంతో పాటు ఇతర శరీర భాగాల్లో దద్దర్లు, స్కిన్ అలెర్జీ ఉన్నట్టు తెలిపారు. తీవ్రమైన ఎండల కారణంగా కొద్ది రోజులుగా డిహైడ్రేషన్‌తో బాబు ఇబ్బంది పడుతున్నారని.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని నివేదికలో వైద్యులు సూచించారు. వైద్యుల నివేదికలో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించినట్లు తేలడంతో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.