Tarakaratna:తారకరత్న పెద్ద కర్మకు ఏర్పాట్లు : కార్డుపై బాలయ్య, విజయసాయిరెడ్డిల పేర్లు.. వెల్ విషర్స్ వాళ్లేనా..?

  • IndiaGlitz, [Sunday,February 26 2023]

సినీనటుడు నందమూరి తారకరత్న అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమను శోక సంద్రంలో ముంచెత్తింది. 39 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన తిరిగిరాని లోకాలకు తరలిపోవడాన్ని నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడే తారకరత్న చనిపోయి రోజులు గడుస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన దశ దిన కర్మకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 2వ తేదీన హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన కార్డును కుటుంబ సభ్యులు తయారు చేయించారు.

సినీ, రాజకీయ వర్గాల్లో ఆ కార్డ్ హాట్ టాపిక్:

అయితే ఈ కార్డులో శ్రేయోభిలాషులుగా తారకరత్న బాబాయ్ నందమూరి బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్లను ప్రత్యేకంగా ముద్రించారు. తారకరత్న తల్లిదండ్రుల పేర్లను గానీ, ఇతర నందమూరి కుటుంబ సభ్యుల పేర్లను గానీ ప్రస్తావించలేదు. తారకరత్న భార్యాపిల్లల పేర్లు, అలేఖ్య రెడ్డి తరపు వారి పేర్లను మాత్రమే ముద్రించారు. ఈ కార్డ్ సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.

కుటుంబ పెద్దలుగా బాలయ్య, విజయసాయిరెడ్డి :

కాగా.. తారకరత్న ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి నేటి వరకు నందమూరి కుటుంబం నుంచి బాలయ్య అంతా తానై వ్యవహరించారు. ఆసుపత్రిలో చికిత్స, కుటుంబ సభ్యులతో సమన్వయం, అంత్యక్రియలు అన్నింట్లోనూ బాలకృష్ణ పెద్దరికం తీసుకున్నారు. అటు అలేఖ్య రెడ్డికి పెదనాన్న అయ్యే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం ఆసుపత్రిలో తారకరత్నను పరామర్శించి వచ్చారు. ఇక ఆయన చనిపోయిన తర్వాత అంత్యక్రియల వరకు భౌతికకాయం పక్కనే వున్నారు. ఈ మధ్యలోనే అలేఖ్య , పిల్లల పరిస్ధితిపై విజయసాయిరెడ్డి .. చంద్రబాబు, బాలకృష్ణ ఇతర కుటుంబ సభ్యులతో చర్చించారు. ఈ క్రమంలో బాలయ్య, విజయసాయిరెడ్డిలకి అలేఖ్య అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు.

పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న:

కాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ కుప్పంలో ఇటీవల యువగళం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారకరత్న కూడా హాజరయ్యారు. అభిమానుల తాకిడి, ఎండ ప్రభావం ఎక్కువగా వుండటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్రకు సిద్ధమవుతూ వుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేయించారు. ఆ వెంటనే పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్నను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. తారకరత్న మరణంతో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.