Bigg Boss 7 Telugu : నువ్వేమైనా పిస్తావా, సందీప్‌ను కడిగిపారేసిన నాగ్.. మూడవ హౌస్‌మేట్‌గా శోభాశెట్టి

  • IndiaGlitz, [Sunday,September 24 2023]

బిగ్‌బాస్ 7 తెలుగు మూడో వారం చివరికి చేరుకుంది. ప్రస్తుతం ఇంటిలో పవర్ అస్త్ర కోసం పోటీ జరుగుతోంది. ప్రిన్స్ యావర్‌ను సైడ్ చేసిన శోభా, ప్రియాంకలు హౌస్‌మేట్ అయ్యేందుకు పోటీపడ్డారు. ఇందులో శోభాశెట్టి గెలిచి.. సందీప్, శివాజీ తర్వాత మూడో హౌస్‌మేట్‌గా నిలిచారు. ఇక ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున కంటెస్టెంట్లు చేసిన తప్పులను , వారి పర్ఫారెన్స్‌ను వివరించారు. ఈ సందర్భంగా సందీప్‌పై నాగ్ విరుచుకుపడ్డారు. తన విధులు సరిగా నిర్వర్తించలేదంటూ ఫైర్ అయ్యారు. సందీప్‌తో పాటు టేస్టీ తేజ, అమర్‌దీప్, రతిక, శుభశ్రీ, ప్రశాంత్‌లు కూడా సరిగా ఆడటం లేదని నాగార్జున విమర్శించారు.

ముఖ్యంగా టాస్క్‌ల సమయంలో సంచాలక్‌గా న్యాయంగా వ్యవహరించడం లేదని ఫైర్ అయ్యారు. శోభాశెట్టికి చికెన్ ముక్కల టాస్క్ ఇచ్చినప్పుడు, గౌతమ్ కృష్ణ 28 పీసులు తిన్నప్పటికీ.. ఓ ముక్క సరిగా తినలేదని చెప్పి అతనిని అనర్హుడిగా ప్రకటించడాన్ని నాగార్జున సమర్ధించారు. అలాగే ప్రియాంకకు బీస్ట్ టాస్క్ అంశాన్ని ప్రస్తావిస్తూ యావర్‌‌ను టాస్క్ నుంచి పక్కకు తప్పించేందుకు సహకరించడంపై నాగ్ ఫైర్ అయ్యారు. నువ్వేమైనా పిస్తా అనుకుని బిగ్‌బాస్ పిలిచాడని అనుకుంటున్నారా అని నాగార్జున మండిపడ్డారు.

ఈ తప్పులకు గాను సందీప్‌ను జైలుకు పంపాలా లేక ఆయన బ్యాటరీ లైఫ్‌ను తగ్గించాలా అని ఆయన ఇంటి సభ్యులను అడిగారు. సందీప్‌ను జైలుకు పంపాలని శోభా, ప్రియాంక చెప్పారు. అయితే నాగ్ మాత్రం బ్యాటరీ డౌన్ చేయడంతో సరిపెట్టారు. అనంతరం ఇంటి సభ్యుల్లో సేఫ్ గేమ్ ఆడుతున్నది ఎవరు, గేమ్ ఛేంజర్ ఎవరు అనే టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. ఇందులో ప్రిన్స్ యావర్‌కు గేమ్ ఛేంజర్‌గా నాలుగు ఓట్లు పడ్డాయి. సేఫ్ గేమ్‌కి సంబంధించి టేస్జీ తేజకు ఎక్కువ మంది ఓట్లు వేశారు. అతను చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడని ఇంటి సభ్యులు చెప్పారు. దీంతో తేజకి పనిష్మెంట్ ఇచ్చారు నాగ్. హౌస్‌లో అంట్లు తోమాలని ఆదేశించారు.

ఇకపోతే.. వారం నామినేషన్స్ లో అమర్‌ దీప్‌, దామిని, గౌతంకృష్ణ, ప్రియాంక, పిన్స్ యావర్‌, రతిక, శుభ శ్రీ ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది చూడాలి. ఇప్పటికే కిరణ్ రాథోడ్, షకీలాలు తొలి రెండు వారాలు ఎలిమినేట్ అయిన సైంగతి తెలిసిందే. వీరిద్దరూ పెద్ద వయస్సు వారు కావడం గమనార్హం. అలాగే వరుసగా ఫిమేల్ కంటెస్టెంట్సే ఎలిమినేట్ అవుతూ వుండటంతో ఈ వారం మేల్ కంటెస్టెంట్‌ను ఇంటికి పంపుతారంటూ ప్రచారం జరుగుతోంది. దామిని, శుభశ్రీలు ప్రస్తుతం డేంజర్ జోన్‌లో వున్నారు. వీరిద్దరికి అతి తక్కువ ఓటింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. దీంతో వీరిలో ఒకరు ఈవారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.