నాగభరణం గీతావిష్కరణ

  • IndiaGlitz, [Friday,September 30 2016]
సాధారణంగా దర్శకులు ఒకే జోనర్‌కు పరిమితమవుతారు. కానీ ప్రతి జోనర్ నుండి అరడజనుకుపైగా హిట్స్ ఇచ్చిన ఏకైక తెలుగు దర్శకుడు కోడి రామకృష్ణ. అలాంటి దర్శకులు దేశంలో లేరు. కుటుంబ కథాంశాలతో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, దేశభక్తి నేపథ్యంలో అంకుశం, భారత్‌బంద్, భక్తి ప్రధాన కథాంశంతో అమ్మోరు, అరుంధతి...ఇలా ప్రతి జోనర్ నుండి హిట్స్ ఇచ్చిన సమర్థత, ప్రతిభ కోడిరామకృష్ణ సొంతం అని అన్నారు ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన తాజా చిత్రం నాగభరణం.
రమ్య, దిగంత్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. సాజిద్ ఖురేషి, ధావల్ గడ, సొహైల్ అన్సారీ నిర్మించారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో మల్కాపురం శివకుమార్ ఈ సినిమాను విడుదలచేస్తున్నారు. గురుకిరణ్ స్వరాలను సమకూర్చిన ఈ చిత్ర గీతాలు గురువారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. బిగ్‌సీడీని తెలంగాణ శాసనమండలి సభ్యుడు కర్నె ప్రభాకర్ విడుదలచేశారు. ఆడియో సీడీలను దర్శకుడు ఎన్.శంకర్ ఆవిష్కరించారు. తొలి ప్రతిని సాయికుమార్ స్వీకరించడంతో పాటు ప్రచార చిత్రాన్ని విడుదలచేశారు.
ఈ సందర్భంగా కోడిరామకృష్ణ మాట్లాడుతూ సినిమా తీయడానికి సృజనాత్మకత ఒక్కటే సరిపోదు. మంచి కథ, తపన కలిగిన నిర్మాత అవసరం. పాము నేపథ్యంలో ఓ కథ వినిపించడానికి నిర్మాత జయంతిలాల్ గడ ఆఫీస్‌కు వెళ్లాను. ఆ సమయంలో అక్కడ ఉన్న సాజిద్ ఖురేషి ఎంత కష్టపడైనా ఈ సినిమాను తానే నిర్మిస్తానని అన్నారు. నిర్మాతగా తన సినిమా గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలన్నారు. తపన, ఓపిక, ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి ఈ సినిమా చేశారు. కన్నడ నటుడు విష్ణువర్ధన్‌తో ఓ సినిమా చేయాలని కోరిక ఉండేది. ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యముంది. గతంలో ఆయనకు ఓ కథ వినిపించాను. కథ నచ్చడంతో సినిమా చేస్తానని మాటిచ్చారు.
బ్యాంకాక్ వెళ్లి కథను డెవలప్ చేసుకునే వచ్చేసరికి విష్ణువర్ధన్ మరణించారు. ఈ సినిమాలో పతాకఘట్టాల్లో విష్ణువర్ధన్‌ను గ్రాఫిక్స్ రూపంలో చూపించాలనే ఆలోచన నిర్మాత సాజిద్ ఖురేషిది. విష్ణువర్ధన్‌ను తెరపై చూసి ఆయన భార్య భారతి కన్నీరు పెట్టుకున్నారు. తన చివరి సినిమాలో నేను మళ్లీ నటుడిగానే పుడతా అని విష్ణువర్ధన్ చెప్పారు. దానికి ఈ చిత్రం ఫస్ట్ ట్రైలర్ అని నిరూపించింది.
ఆంధ్రా, తెలంగాణ రెండు రాష్ర్టాలకు సరిపోయే బలం మా సినిమాలో ఉంది. ప్రేక్షకులు తమ కష్టాలను కన్నీళ్లను మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ సినిమా చూడాలి. ప్రేక్షకులకు ఆ సంతోషాన్ని అందించాలనే తపనతో ప్రతి సినిమా చేస్తాను. ఈ ట్రైలర్ చూసి ఓ పెద్ద నటుడు, నిర్మాత ఫోన్ చేసి విష్ణువర్ధన్ తరహాలో మా నాన్నను తెరపై చూసుకోవాలనుందని అభినందించారు. శివకుమార్ లాంటి ప్రొడ్యూసర్ ఉంటే పరిశ్రమ ఎప్పుడూ బాగుంటుంది అన్నారు. ఈ మధ్యకాలంలో పాము కథాంశంతో సినిమాలు రాలేదు. మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే తపనతో ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా ద్వారా విడుదల చేస్తున్నాను. టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అక్టోబర్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ఎగ్జిబిటర్స్ నుండి చక్కటి స్పందన లభిస్తుంది. బిజినెస్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాకు తొలి హీరో కోడిరామకృష్ణ అయితే రెండో హీరో మకుట సంస్థ. వారి అందించిన గ్రాఫిక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అని మల్కాపురం శివకుమార్ పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ శివకుమార్ నాకు ఆత్మీయుడు, ప్రాణస్నేహితుడు. సినిమా రంగంలో నాకు శంకర్, శివకుమార్ తప్ప ఎవరూ తెలియదు. 1988లో మొదటిసారి కోడి రామకృష్ణను సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఓ సినిమా చిత్రీకరిస్తున్న సమయంలో చూశాను. గ్రామీణ నేపథ్యంలో అమ్మోరు సినిమాను అద్భుతంగా రూపొందించారాయన. శివకుమార్‌కు ఈ సినిమాతో పెద్ద విజయం దక్కాలని, అతడు పెట్టిన డబ్బులు తిరిగిరావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.